News April 11, 2024
కుప్పం మీదుగా స్పెషల్ రైలు

గోరఖ్పూర్ స్పెషల్ రైలును రేపటి నుంచి కుప్పం మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్పూర్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో సోమవారం సాయంత్రం 5.40గంటలకు కుప్పం మీదుగా బెంగళూరు కృష్ణరాజపురానికి వెళ్తుంది. 6 వారాలు మాత్రమే ఈ స్పెషల్ రైలు నడవనుంది.
Similar News
News February 28, 2026
తిరుపతిలో బస్సుల దారి మళ్లింపు

తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి తిరుమల బైపాస్ రోడ్డు, అలిపిరి, టౌన్ క్లబ్ మీదుగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
News February 28, 2026
చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.
News February 28, 2026
చిత్తూరు పోలీసులకు అవార్డులు

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరు అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్ఐ రవి, చిత్తూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పలమనేరు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ లీలాసుఖ నాయుడు, చిత్తూరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, రాళ్లబూదుగూరు హెడ్ కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.


