News October 23, 2025
కృష్ణా జిల్లాను ముంచెత్తిన వాన

కృష్ణా జిల్లాను వర్షం ముంచెత్తింది. మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, బంటుమిల్లి, ఉయ్యూరు తదిరత ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. అత్యధికంగా మచిలీపట్నంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నాగాయలంకలో 7.6, బంటుమిల్లిలో 5.6, ఘంటసాలలో 5.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 1-5 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి.
Similar News
News October 23, 2025
కృష్ణా: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరిక

భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, లైన్కు తగిలిన చెట్లను ముట్టుకోవద్దని చెప్పారు. విద్యుత్ లైన్ దెబ్బతిన్నట్లు గమనిస్తే వెంటనే సిబ్బంది, లేదా 1912 నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
News October 23, 2025
కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
News October 23, 2025
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్ 08672-252572 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా 24/7 సహాయచర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.