News March 26, 2026
కౌడిపల్లి: ఫిట్స్తో పొలంలో రైతు మృతి

కౌడిపల్లి మండలం బుజరంపేట(పిర్యా) తండాలో విషాదం నెలకొంది. పొలంలో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రైతు సమ్యా నాయక్ మరణించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఫిట్స్ రావడంతో ఆయన అదుపు తప్పి పొలంలోని బురదలో పడిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 3, 2026
పీడీఎస్ సేవలు పారదర్శకంగా ఉండాలి: నిత్యానంద్

టేక్మాల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ హెచ్చరించారు. వెలుపుగొండ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయగా 36.32 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ దినకర్పై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News April 2, 2026
మెదక్: ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83% హాజరు

మెదక్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 11,247 మందికి గాను 11,228 మంది పరీక్ష రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 2, 2026
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సక్రమంగా తీర్మానాలు చేయాలని అధికారులకు సూచించారు.


