News January 25, 2026
ఖమ్మంలో జిల్లాలో ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్’

ఖమ్మంలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 864 మందికి గాను 860 మంది, మధ్యాహ్నం 863 మందికి 856 మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ ఆర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News February 5, 2026
నిధుల బకాయిల ఉచ్చులో ఖమ్మం పెద్దాసుపత్రి

ఖమ్మం పెద్దాసుపత్రికి ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆర్థో విభాగానికి రావాల్సిన రూ.60 లక్షల బకాయిల వల్ల మోకాళ్ల ఆపరేషన్లు నిలిచిపోయాయి. క్యాత్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, రోగులకు సరైన చికిత్స అందడం లేదని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
News February 5, 2026
ఖమ్మం RTA ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా

KMM జిల్లా RTA కార్యాలయం సమీపంలోని ఏజెంట్ షాపుల కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల దందా సాగుతోంది. కొంతమంది కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మారుస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News February 4, 2026
ఫర్టిలైజర్ యాప్తో సజావుగా యూరియా పంపిణీ: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జనవరి 29 నుంచి నిన్నటి వరకు 25,252 మంది రైతులు యాప్ ద్వారా 1,08,721 యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, 87,350 సంచులు కొనుగోలు చేశారు. రైతులు పంట, విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సొసైటీల్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాప్ ద్వారా క్యూలైన్లు లేకుండా సమయం ఆదా అవుతోందన్నారు.


