News February 18, 2026
జిల్లాలోనే ‘టాప్’లో జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్..!

అంకితభావంతో సేవలు అందిస్తూ కూసుమంచి మండలం జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ అరుదైన రికార్డు సృష్టించింది. సేవలందించడంలో జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ జిల్లాలో ప్రథమ, రాష్ట్రంలో టాప్-10 స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. గ్రామస్తుల్లో పొదుపు అలవాటు ఎక్కువగా ఉండటం వల్లే ఈ పోస్ట్ ఆఫీస్ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.
Similar News
News February 18, 2026
ఖమ్మం: ‘అభివృద్ధి పనులు, రుణాల రికవరీపై సమీక్ష’

జిల్లాలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ బుధవారం సమీక్షించారు. ఉపాధి హామీ పనుల పురోగతి పెంచి, చెల్లింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి చేయాలని, ఎన్పీఏల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, గ్రాంట్ల వినియోగంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.
News February 18, 2026
మధిర: ఇద్దరు హెచ్ఎంలపై వేటు

మధిరలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గర్ల్స్ హైస్కూల్ HM హైమావతిని వరంగల్ ఆర్జేడీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ తనిఖీలో లోపాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ HM కెబిఎస్ రాజును వేంసూర్కు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వల్లే ఈ చర్యలని డీఈవో జైని తెలిపారు.
News February 18, 2026
ఖమ్మం: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

ఖమ్మం (D)లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తెచ్చింది. క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయమని RTO జగదీష్ స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో నిలిపి ఉంచిన లారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు.


