News August 10, 2025
నకిరేకల్లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

నకిరేకల్ మండలం ఆర్లగడ్డలగూడెం గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వేములపల్లి మండలం సల్కునూరుకి చెందిన నర్సింగ్ అంజమ్మ, రాఖీ కట్టేందుకు తన సోదరుడి ఇంటికి వచ్చిందని స్థానికులు తెలిపారు. రాత్రి 365వ నంబర్ హైవే దాటుతుండగా, నల్గొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న మినీ గూడ్స్ వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News August 10, 2025
NLG: మరో మూడు రోజులే ఛాన్స్.. దరఖాస్తు చేయండి..!

కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులంతా రైతు బీమా పథకానికి ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు పాస్పుస్తకాలు పొందిన రైతులందరూ అర్హులని ఆయన పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మండల కేంద్రాల్లోని ఏఈఓలకు అందజేయాలని ఆయన సూచించారు.
News August 9, 2025
NLG: రాఖీ కోసం.. రాష్ట్రాలు దాటిన సైనికుడు

మంచు కురిసే సరిహద్దుల్లో మాతృభూమికి కాపలాగా నిలిచే సైనికుడు రాఖీ వేళ చెల్లెళ్లపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న నల్గొండకు చెందిన లక్ష్మణ్ తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకునేందుకు ప్రత్యేక సెలవుపై రాష్ట్రాలు దాటి స్వగ్రామానికి చేరుకున్నారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తూనే రాఖీ వేడుక కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన లక్ష్మణ్కు రాఖీ కట్టిన చెల్లెళ్లు ఆనందంతో మురిసిపోయారు.
News August 9, 2025
NLG: న్యాయం చేయాలని పోలీసులకు రాఖీ కట్టి..!

రాఖీ పండుగ వేళ నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ నకిరేకల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి డ్యూటీలో ఉన్న సిబ్బందికి రాఖీ కట్టింది. తాటికల్లు గ్రామంలోని బాట పంచాయితీ వివాదంలో తన భర్త ముచ్చపోతుల వెంకన్నపై జంజిరాల వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును త్వరగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది.