News December 30, 2025
మారనున్న తూర్పుగోదావరి రూపురేఖలు

కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ మూడు మండలాల ప్రజలు రాజమండ్రి ఆర్డీవో పరిధిలో సేవలు పొందనున్నారు. గత కొంతకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News December 30, 2025
మహిళా సాధికారతపై పురందీశ్వరి సమీక్ష

తిరువనంతపురంలో మంగళవారం జరిగిన ‘మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ’ సమావేశంలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి పాల్గొన్నారు. ఎస్బీఐ, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక శాఖ ప్రతినిధులతో కలిసి స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్షించారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఈ సంఘాలు పోషిస్తున్న పాత్రను ఆమె వివరించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు బ్యాంకులు మరింత తోడ్పాటు అందించాలని ఎంపీ సూచించారు.
News December 30, 2025
ఇంటి వద్దే వేడుకలు చేసుకోండి: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకలను సామాజిక బాధ్యతతో, సంయమనంతో జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి విలువలు ప్రతిబింబించేలా కొత్త ఏడాదిని స్వాగతించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
News December 30, 2025
ప్రజల కోసమే పోలీసుల సేవలు: ఎస్పీ

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అధికారులను మంగళవారం సన్మానించారు. ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఎస్పీ డి. నరసింహ కిశోర్ హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఎస్సై డి. సత్యనారాయణ, ఎస్సై జి. రామకృష్ణ పరమహంస, ఎఎస్సై కే. జయలక్ష్మి, ఎఆర్ఎస్ఐ ఎం.రాధాకృష్ణలను ఎస్పీ సన్మానించారు. పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సర్వీసులో వారు అందించిన సేవలను కొనియాడారు.


