News October 26, 2025
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 26, 2025
VZM: మూడు రోజులు పాఠశాలలకు సెలవు

మొంథా తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. అన్ని పాఠశాలలు పూర్తిగా మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలన్నారు.
News October 26, 2025
విజయనగరం జిల్లా రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

విజయనగరం జిల్లాలో మొత్తం 1,04,828 హెక్టార్లలో వరి సాగు జరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పంటలు పాలుపోసే దశ నుండి కోత దశ వరకు వివిధ దశల్లో ఉన్నాయని, వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలాల్లో నీరు చేరితే బయటకు పంపే చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు ముందు వర్షం వస్తే వరి వెన్నులపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణంతో పిచికారీ చేయాలన్నారు.
News October 26, 2025
రైతులను అప్రమత్తం చేయండి: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.


