News September 20, 2025
యాదాద్రి: శ్రీ స్వామివారి సేవలో హైకోర్ట్ జడ్జి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని శనివారం హైకోర్టు జడ్జి కే.శరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని ధ్వజస్తంభ దర్శనానంతరం స్వయంభు దర్శనం చేసుకొని గోత్రనామార్చిన పూజలు చేశారు. అర్చకులు స్వర్ణ పుష్పార్చన చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు.
Similar News
News September 21, 2025
వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.
News September 21, 2025
మేడారంలో హరితం.. వెలుగులీననున్న సంప్రదాయం!

కోటిన్నర మంది భక్తుల రాకతో రెండేళ్లకోసారి జనారణ్యంగా మారే మేడారంలో ఆదివాసీలు దైవంలా కొలిచే సంప్రదాయ వృక్షాలు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు వనదేవతల గద్దెలపై ఉండే రావి, జువ్వి, బండారి వంటి జాతుల వృక్షాలు కనుమరుగయ్యాయి. ఈ పరిణామం భక్తుల విశ్వాసాలకు ఇబ్బందిగా మారింది. అయితే.. మేడారం పరిసరాల్లో ఆదివాసీల సంప్రదాయ వృక్షాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. అలాగే ఇప్ప, వెదురు వనాలను సంరక్షించాలి.
News September 21, 2025
వేయి స్తంభాల గుడిలో వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు రేపు వేయిస్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. రాష్ట్ర మహిళలకు మంత్రి కొండా సురేఖ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సురేఖ తెలిపారు.