News September 2, 2025
శ్రీకాకుళం రిమ్స్లో డెంగ్యూతో మహిళ మృతి

శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో మద్ది జగన్మోహిని (34) అనే మహిళ సోమవారం మృతి చెందింది. టెక్కలి మండలం భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళ డెంగ్యూ జ్వరంతో కొన్ని రోజులుగా రిమ్స్లో చికిత్స పొందుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా భగవాన్పురం గ్రామంలో జ్వరాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వైద్య శిబిరాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News September 3, 2025
అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.
News September 3, 2025
పలాసలో దారుణ హత్య ..!

పలాస(M) కేసుపురంలో మంగళవారం అర్ధరాత్రి చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలువురు దాసుల వద్దకు వెళ్లగా గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 3, 2025
సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు : ఎమ్మెల్సీ కళ్యాణి

2017లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని ఆమె వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.