News March 30, 2025
సవతి తల్లి కర్కశత్వం.. పిల్లాడిని గోడకేసి కొట్టడంతో

AP: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మొదటి భార్య కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి చిన్న కొడుకు కార్తీక్(6) మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఆకాశ్కు రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో భర్త సాగర్, లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 2, 2025
వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.
News April 2, 2025
హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

TG: హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.
News April 2, 2025
కర్ణాటకలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్స్పై నిషేధం

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం(1988)లోని సెక్షన్-93ని అనుసరించి ప్రభుత్వం నిబంధనల్ని ఏర్పాటు చేసేవరకూ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులివ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.