News July 8, 2025
ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం శోచనీయం: హరీశ్ రావు

ఉపాధి హామీ ఏపీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని “X” వేదికగా డిమాండ్ చేశారు.
Similar News
News July 8, 2025
పలు అంశాలపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవసరాలకు సరిపడినంత ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత, వివిధ నిర్మాణాలకు సేకరణ, అక్రమ రవాణా నియంత్రణ, భూ భారతి చట్టం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమగు ఇసుక అంచనా నివేదికను సిద్ధం చేయాలన్నారు.
News July 8, 2025
మహదేవపూర్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాల్ కొటేషన్స్

మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఎస్ఐ జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో గోడలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ వాల్ కొటేషన్స్ ద్వారా మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో “మన ఊరు-మన పోలీస్” కార్యక్రమంలో భాగంగా ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నామని, ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటూ, సమస్యలను తెలుసుకొని న్యాయం చేస్తామని ఎస్ఐ అన్నారు.
News July 8, 2025
ఈనెల 16న ఆమెకు మరణశిక్ష అమలు!

యెమెన్లో వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయనుంది. 2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్పోర్టు లాక్కున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా పాస్పోర్ట్ తీసుకోవాలని 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో అరెస్టైన ఆమెకు మరణశిక్ష పడింది.