News October 6, 2025
MDK: ‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, శాంతి భద్రతలతో సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్లో ఎన్నికల నియమాలపై అధికారులకు అవగాహన శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి అధికారి గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి శిక్షణ అందజేశారు.
Similar News
News October 6, 2025
ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు: కలెక్టర్

ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005, ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయి చట్టంగా ఉందని తెలియజేశారు. ముఖ్యమైన చట్టం అమలులోకి వచ్చినందుకు ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరుల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
News October 6, 2025
మెదక్: ఈనెల 8న కేంద్ర బృందం పర్యటన

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ, NRSCకి చెందిన అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
News October 6, 2025
మనోహరాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాలకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. నోబుల్ కళాశాలలో సౌకర్యాలు, భద్రత, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.