News October 9, 2025
ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో ఆయన ఉండవల్లిలో బుధవారం సమావేశమయ్యారు. టీచర్ల బదిలీలు, భాషా పండితుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని లోకేశ్ అన్నారు.
Similar News
News October 9, 2025
తెనాలి: ‘మావు’లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు.!

కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.
News October 9, 2025
బాణాసంచా విక్రయాలకు పర్మిషన్ తీసుకోవాలి: కలెక్టర్

దీపావళి పండగకు బాణాసంచా విక్రయించే షాపుల అనుమతులకు అక్టోబర్ 17 లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 20న దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకొనుటకు ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 9, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం మొత్తం 75,000 బస్తాల A/C సరకు వచ్చింది. మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నా, కొన్ని రకాల ధరలు ఆకర్షణీయంగా పలికాయి. పసుపు రకం మిర్చి ధర కిలోకు ₹200 నుంచి ₹250 వరకు అత్యధికంగా నమోదైంది. తేజా A/C రకం ధర కిలోకు ₹100 నుంచి ₹152 వరకు పలికింది. 341 A/C రకం గరిష్ఠంగా ₹165కి చేరుకుంది. నాటు రకాలైన 334, సూపర్ టెన్ రకాలు కిలోకు ₹90 నుంచి ₹155 వరకు ట్రేడ్ అయ్యాయి.