News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News February 18, 2026
ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
News February 17, 2026
శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 17, 2026
సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో బంజారా సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి పలు సూచనలు చేశారు.


