News January 6, 2026
జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్గా సుబ్బారాయుడు

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
Similar News
News February 5, 2026
ఉగాది నాటికి 8,378 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి: పీడీ

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
News February 5, 2026
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. అటవీ శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్ బలగాలను పంపిస్తున్నట్లు తెలిపారు. రాజానగరం తహశీల్దార్ అటవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామస్థులను అప్రమత్తం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News February 5, 2026
రాజానగరంలో మెగా జాబ్ మేళా.. ఎప్పుడంటే..!

రాజానగరంలో ఫిబ్రవరి 8న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను MLA బత్తుల బలరామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. AP స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగే ఈ మేళాలో 60 బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. దీని ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభిస్తుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభం కానుంది.


