News July 31, 2024
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: సబితా ఇంద్రారెడ్డి

TG: రాష్ట్రంలో స్త్రీలకు భద్రత కరవైందని, వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించి 48 గంటలైనా గడవక ముందే 4 అత్యాచారాలు జరిగాయన్నారు. ఇవి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆపాలని ఆమె సూచించారు.
Similar News
News February 13, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా

TG: నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను సొంతం చేసుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో BRS గెలిచింది.
News February 13, 2026
స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.
News February 13, 2026
సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్స్వీప్

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది.


