Anantapur

News October 25, 2024

పోలీసులకు సహకరించండి: కేతిరెడ్డి, ఆయన కుమారులకు హైకోర్టు ఆదేశం

image

తాడిపత్రి మాజీ MLA పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయిప్రతాప్ రెడ్డిపై గతంలో నమోదైన 3 కేసులపై గురువారం హైకోర్టు విచారించింది. ఈ కేసుల దర్యాప్తునకు పోలీసులకు సహకరించాలని పెద్దారెడ్డి, ఆయన కుమారులను ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులు సూచిస్తూ.. తదుపరి విచారణ వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసువద్దని పేర్కొంది.

News October 25, 2024

అనంత: విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం..!

image

శింగనమల మండలం సోదనపల్లికి చెందిన స్నేహితులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. పోతురాజు కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర్ రెడ్డి, వెంకటరమణ మృతిచెందారు. వీరు ప్రాణ స్నేహితులని, ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.

News October 25, 2024

29న దిశ సమావేశం: కలెక్టర్

image

జిల్లా దిశ సమావేశం ఈ నెల 29న (మంగళవారం) అనంతపురంలోని రెవెన్యూ భవనంలో జరగనుందని కలెక్టర్ డా.వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగనున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. అజెండా ప్రకారం గ్రామీణ, పట్టణ తాగునీరు, ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు, తదితర అంశాలపై సమీక్షలు ఉంటాయని తెలిపారు.

News October 25, 2024

విద్యార్థులు చేసిన బ్రీమాటో ప్రాజెక్ట్ పరిశోధనలు విజయవంతం

image

గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నట్లు అగ్రికల్చర్ వింగ్ కో ఆర్డినేటర్ రామ్ గోపాల్ మోపూరి తెలిపారు. టమాటా మొక్కకు టమాటాతో పాటు వంకాయలు కాసే విధంగా డ్రాపింగ్ చేసి ఒకే చెట్టుకు రెండు రకాల కాయలు కాసే విధంగా చేశారన్నారు. విద్యార్థుల ప్రతిభను పలువరు ప్రశంసించారు.

News October 25, 2024

జూనియర్‌ లాయర్ రుక్సానా సూసైడ్

image

అనంతపురం కోర్టు రోడ్డులో నివాసముంటున్న జూనియర్‌ న్యాయవాది రుక్సానా ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్‌ఐ రుష్యేంద్రబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈమె అనంతపురం న్యాయవాదుల బార్‌ అసోసియేషన్‌లో క్రియాశీల సభ్యురాలిగా ఉండేవారు. SKUలో LLB పూర్తి చేశారు.

News October 25, 2024

రహదారుల నిర్మాణపు పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారుల నిర్మాణపు పనులను ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, రైల్వే లైన్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపరిహారం చెల్లించిన భూముల్లో పనులు ప్రారంభించాలన్నారు.

News October 24, 2024

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారిగా మలోలా

image

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారిగా మలోలాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఆర్ఓగా ఉన్న రామకృష్ణారెడ్డిని సచివాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డీఆర్ఓగా వస్తున్న మలోలా గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీఓగా విధులు నిర్వహించారు.

News October 24, 2024

ప్రకృతి ప్రేమికుల పరవశం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాల కారణంగా చెరువులు పొంగిపొర్లి ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. ధర్మవరం పట్టణ సమీపంలోని చెరువు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. చెరువు అందాలను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రకృతి ప్రేమికులతో పాటు ధర్మవరం పట్టణ ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సందడిగా మారి దర్శనమిస్తోంది.

News October 24, 2024

కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి

image

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లి కాపు కార్పొరేషన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తారని అన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణాలు చేపట్టబోతున్నామన్నారు.

News October 24, 2024

అనంతపురం జిల్లాలో 12,08,293 కుటుంబాలకు ఫ్రీ గ్యాస్!

image

మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ పంపిణీ చేస్తారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేస్తారు. అర్హులను తెల్లరేషన్ కార్డుల ప్రాతిపదికన నిర్ణయిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12,08,293 కుటుంబాలు లబ్ధిపొందుతాయి. మొత్తంగా జిల్లాలో 12,54,911 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.