Anantapur

News April 12, 2024

అనంత: రంజాన్ పండుగ వేళ విషాదం

image

కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన డ్రైవర్ లాల్ బాషా విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నమాజు చదువుకునే ముందు వుజూ చేసుకునేందుకు నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది. ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.  ఉరవకొండలో చికిత్స పొందుతూ బాషా మృతి చెందాడు. 

News April 12, 2024

అనంత: యువతిపై లైంగికదాడి

image

పామిడి మండలంలోని కండ్లపల్లిలో ఓ దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన యువతిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెంబడించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.

News April 12, 2024

అనంతలో ఫలితాల కోసం 41,556 మంది వెయిటింగ్

image

అనంతపురం జిల్లాలో 170 జూనియర్‌ కళాశాలల నుంచి 41,556 మంది ఇంటర్ విద్యార్థులు రెగ్యులర్‌, ఒకేషనల్‌ వార్షిక పరీక్షలు రాశారు. వీరిలో 24,446 మంది మొదటి సంవత్సరం, 17,110 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 21న మూల్యాంకనం ప్రారంభం కాగా ఈనెల 4 నాటికి పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.

News April 12, 2024

భద్రంపల్లి ప్రజలకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాం: బండారు శ్రావణి

image

బుక్కరాయసముద్రం (మం) భద్రంపల్లిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి పాల్గొన్నారు. స్మశాన వాటిక లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏళ్ల నుంచి స్మశాన వాటిక సమస్య పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదని గ్రామస్థులు వాపోయారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భద్రంపల్లి ప్రజలకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

News April 11, 2024

యాడికి: విషపురుగు కుట్టి వృద్ధురాలు మృతి

image

యాడికి మండలం గుడిపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు విషపురుగు కుట్టడంతో మృత్యువాత పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మమ్మ ఇంటి వద్ద అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో విషపురుగు కుట్టింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2024

సత్యసాయి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కొత్త పల్లి గ్రామ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో విద్యుత్ షాక్‌తో రాధమ్మ అనే‌ మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తన ఇంటి సమీపంలో పంచాయతీ బోరు ఉండడంతో వంట పాత్రలు కడగడానికి వెళ్ళగా.. విద్యుత్ తీగలు ఆమెకు తగలడంతో మృతి చెందినట్లు భర్త హనుమంతు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News April 11, 2024

అనంత: తెగిపడిన హైటెన్షన్ వైరు.. తప్పిన పెను ప్రమాదం

image

గుంతకల్లులోని కసాపురం రోడ్డులోని అయ్యప్ప దేవాలయం వద్ద బుధవారం హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ వైరు తెగిపడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే శాటిలైట్ అనుసంధానంగా ఆ లైన్ బ్రేక్ డౌన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్పందించిన ట్రాన్స్ కో ఉన్నతాధికారులు సిబ్బందిని పురమాయించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 11, 2024

పగటి ఉష్ణోగ్రతల్లో కాస్త తగ్గుదల

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శెట్టూరు మండలంలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పరిగిలో 40.0, బొమ్మనహాళ్ 39.8, చెన్నేకొత్తపల్లి 39.7, తాడిపత్రి 39.5, పెద్ద వడుగూరు, కొత్తచెరువు 39.2, తలుపుల, రొద్దం 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వారు తెలిపారు.

News April 11, 2024

అనంత జిల్లాలో 9 మంది సస్పెండ్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. నార్పల మండల కేంద్రంలోని 1, 2 సచివాలయాల్లో ఏడుగురు వాలంటీర్లను, సిద్ధరాచెర్ల గ్రామ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు, రాప్తాడు మండలం బొమ్మేపర్తి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి తప్పక పాటించాలన్నారు.

News April 11, 2024

అనంత: వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

image

రాయదుర్గం మండలంలోని కొంతనపల్లికి చెందిన గొర్రెల కాపరి బోయ వన్నూరప్ప(65) వడదెబ్బతో మృతి చెందాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్నూరప్ప ఎప్పటిలాగే మంగళవారం కూడా తనకున్న సుమారు 50 గొర్రెలను మేపుకోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మంగళవారం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా అక్కడి నుంచే నేరుగా గుండ్లపల్లికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రాత్రి పరిస్థితి విషమించి మృతిచెందాడు.