Anantapur

News May 25, 2024

అనంత: మధుసూదన్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

image

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నెల 13న నల్లమాడ మండలంలోని నల్ల సింగయ్యగారి పల్లెలో మధుసూదన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలపై దాడికి ప్రయత్నించిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఎస్సై రమేశ్ బాబు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా అతడు పరారీలో ఉన్నారు.

News May 25, 2024

అనంత: నాలుగు వరుసల రైల్వే లైన్ల నిర్మాణానికి కసరత్తు

image

రాష్ట్రంలోనే మొదటిసారి గుంతకల్లు రైల్వే డివిజన్‌లో 4 వరుసల రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందుకోసం సర్వే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గుంతకల్లు నుంచి చెన్నై వైపు గుత్తి, తాడిపత్రి, కడప మీదుగా ఓబులవారిపల్లి వరకు 188.75 కి.మీ. పొడవుగా ప్రస్తుతమున్న రెండు వరుసల రైల్వేలైన్లకు తోడుగా మరో రెండు లైన్లు నిర్మించనున్నారు.3,4 వరుసల లైన్లను అందుబాటులోకి తేవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

News May 25, 2024

కౌంటింగ్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

image

సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై అనంతపురం జిల్లా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ గౌతమి శాలి కలిసి జిల్లాలోని అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

News May 24, 2024

కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ తో కలిసి పరిశీలించారు.

News May 24, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్‌లకు అనుమతి లేదు: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అధికారులకు వివరించారు.

News May 24, 2024

అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి

image

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మరుట్ల గ్రామంలో భాను శ్రీ అనే బాలిక గురువారం రాత్రి ఇంట్లో విద్యుత్ షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 24, 2024

విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన కానిస్టేబుల్ వీఆర్‌కు

image

లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న చెన్నకేశవ అనే కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీచేసినట్లు డీఎస్పీ కంజక్షన్ తెలిపారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ప్రొటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు అందాయని వాటిని దృష్టిలో పెట్టుకుని వీఆర్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

News May 24, 2024

అనంత జిల్లాలో నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీ

image

అనంతపురం జిల్లాలో నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమామహేశ్వరమ్మ, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. మొత్తం 353 రైతుభరోసా కేంద్రాల్లో 31 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ నిల్వ చేశామన్నారు. జిల్లాలో గత ఐదు రోజులుగా 40,704మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. గరిష్ఠంగా ఒక్కో రైతుకు మూడు బస్తాలు (90 కిలోలు) ఇస్తామన్నారు.

News May 24, 2024

అనంత: టపాసుల క్రయ విక్రయాలపై నిషేధం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టపాసులు క్రయవిక్రయాలపై నిషేధం విధించమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే టపాసుల అమ్మకాలు నిషేధించామన్నారు జూన్ 6వ తేదీ వరకు ఎక్కడ టపాసుల అమ్మకాలు జరగకూడదని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రవాణా, అమ్మకాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News May 24, 2024

గుత్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

గుత్తి రైల్వేస్టేషన్‌లోని యార్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందారు. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన మాల కంబగిరి స్వామిగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. కంబగిరి స్వామి చిత్తు పేపర్లు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి యార్డులో చిత్తు పేపర్లు ఏరుకుంటున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.