EastGodavari

News August 6, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి నీటి విడుదల

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 7 గంటలకు 6,33,226 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టాకు 3,800, మధ్య డెల్టాకు 2000, పశ్చిమ డెల్టాకు 5000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

News August 6, 2024

కాకినాడ: మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిస్సింగ్

image

తొండంగి మండలంలో ఓ మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ఉప్పాడ మండలం అమరవిల్లికి చెందిన లలిత ఐదేళ్లుగా GMపేట సచివాలయంలో ఇంజినీర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. శనివారం విధులకు హాజరై సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరింది. రాత్రి 7:40 గంటలకు కాకినాడ పోర్ట్ ప్రాంతంలో ఆమె సిగ్నల్ కట్ అయింది. అంతకుముందు ఆమె అన్నయ్యకు చనిపోతున్నానని మెసేజ్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదైంది.

News August 6, 2024

ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతి: SVSN వర్మ

image

పిఠాపురంలో గత ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే స్థలాలను రూ.కోట్లల్లో కొని ప్రజలకు కేటాయించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

News August 5, 2024

తూ.గో: ‘సినిమా చెట్టు’ను నాటిందెవరో తెలుసా..?

image

కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ ఇకనుంచి ఓ చరిత్ర. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరు చెట్టును గోదావరి ఒడ్డున సింగలూరి తాతబ్బాయి నాటినట్లు స్థానికులు చెబుతుంటారు. 150 ఏళ్లుగా ఎన్నో వరదలు, తుఫాన్‌లను తట్టుకుంటూ.. తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహా వృక్షమైంది. షూటింగ్స్ ఎక్కువగా జరగడం వల్ల ‘నిద్ర గన్నేరు’ అనే అసలు పేరును కూడా మర్చిపోయి ‘సినిమా చెట్టు’ అని పిలుస్తారు అక్కడి జనాలు.

News August 5, 2024

పిఠాపురంలో ‘ఆయ్’ మూవీ ట్రైలర్ లాంచ్

image

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ‘ఆయ్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం పిఠాపురంలో జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ MLA, టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. నటీనటులు, టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. MAD సినిమాతో హిట్ కొట్టిన Jr.NTR బావమరిది నార్నే నితిన్ హీరోగా చేస్తున్న ‘ఆయ్’.. ఈనెల 15న రిలీజ్ కానుంది.

News August 5, 2024

సీఎం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు

image

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు కలెక్టర్లు పాల్గొన్నారు. తూర్పు గోదావరి కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు విజన్-2047పై దిశా నిర్దేశం చేశారు.

News August 5, 2024

తూ.గో.: గోకవరం మహిళ వరల్డ్ రికార్డ్

image

తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రానికి చెందిన దామోదర లలిత జ్యోతి వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. బెంగళూరుకు చెందిన శశి క్లాసెస్ సంస్థ దేశవ్యాప్తంగా జూన్ 26న ఆన్‌లైన్‌లో నిమిషంలో ఎక్కువ ఆర్గానిక్ సబ్బుల తయారీపై పోటీ నిర్వహించారు. కాగా 27 మంది బృందంగా ఏర్పడి 2008 సబ్బులు తయారుచేశారు. వీరిలో లలిత ఒకరు. కాగా ఆమె ఆదివారం వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌ నుంచి మెడల్ అందుకున్నారు.

News August 5, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు వర్షాలకు ఛాన్స్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూ.గో, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
SHARE IT..

News August 4, 2024

కాకినాడలో అరగుండు కొట్టించుకున్న టీడీపీ అభిమాని

image

అరాచక వైసీపీ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ తాను ఎన్నికల ముందు మొక్కుకున్నానని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు మురళి వీరభద్రరావు తెలిపారు. ఆదివారం కాకినాడలోని ఇంద్రపాలెం గ్రామ దేవత ముసలమ్మకు సగం మొక్కును చెల్లిస్తూ సగం గుండు కొట్టించుకున్నారు. మరో సగం సోమవారం తిరుపతి పుణ్యక్షేత్రంలో చెల్లిస్తానన్నారు.

News August 4, 2024

రాజవొమ్మంగి: కిలో రొయ్యలు రూ.350

image

రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట అటవీ ప్రాంతంలోని వట్టిగడ్డ రిజర్వాయర్‌లో పెద్దపెద్ద రొయ్యలు కనిపిస్తున్నాయి. ఆదివారం మత్స్యకారుల వలకు భారీ రొయ్య చిక్కింది. కిలోకు 10 రొయ్యలు మాత్రమే వస్తుండగా ధర రూ.350గా పలుకుతోంది. భారీ వర్షాలకు రిజర్వాయర్ పూర్తిగా నిండటంతో నీరు తగ్గేవరకు రొయ్యల వేట వీలుకాదని మత్య్సకారులు చెబుతున్నారు.