India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
సీఎం చంద్రబాబు 11.50 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. దీపం-2 పథకంలో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడానికి అవసరమైన రూ.876 కోట్ల చెక్ను గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేయనున్నట్లు తెలిపారు. 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయం తెలిపింది.
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వ రామారావు(90) మంగళవారం తెనాలిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లాంగ్ ఫామ్లో సుదీర్ఘకాలంగా పనిచేయడంతో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా కూడా వ్యవహరించారు. వేమూరు మండలం జంపనిలో 1935, జూన్ 4వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో రామారావు జన్మించారు. నవంబర్ 1న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్కు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో విచారణ అనంతరం పోలీసులు అనిల్ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ను నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు తిరిగి అనిల్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ షరతులను సడలించాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, పోలీసుల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడంతో మంగళవారం వాదనలు ముగిశాయి. నవంబర్ 4వ తేదీన తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. సింగపూర్లో కుమారుడి విద్యాభ్యాసం కోసం తాను వెళ్లాల్సి ఉందని తన పాస్పోర్ట్ వెనక్కి ఇప్పించాలని కోరారు.
ప్రత్తిపాడు మండలం చిన్న కొండ్రుపాడులో మంగళవారం వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి-కొడుకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమారుడు చేతిలో తోక వెంకటరామయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పసికందును అమ్మేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలను మంగళగిరి టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ వినోద్ కుమార్ తెలిపిన ప్రకారం.. విజయవాడకు చెందిన గుమ్మడి ఉమాదేవి, త్రినాథ్ అనే భార్యాభర్తలను అదుపులోకి తీసుకొని పసికందును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పసికందును గుంటూరు సీడీపీఓకు అప్పగించామని, పసికందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
వెలగపూడిలోని మరియమ్మ అనే వృద్ధురాలి హత్య కేసులో హైకోర్టులో నందిగం సురేశ్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ పై తీర్పు నవంబర్ 6న వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా ఇటీవలే సురేశ్ను తుళ్ళూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గుంటూరులోని అరండల్ పేటలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీపై వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. సదరు ఇన్సూరెన్స్ కంపెనీలో వినియోగదారుడికి రావాల్సిన నగదు ఆలస్యం కావడంతో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలోని ఉద్యోగులపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మిర్చియార్డుకు సోమవారం 63,735 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 54,065 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. ఇంకా యార్డు ఆవరణలో 28,584 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.