Guntur

News April 16, 2024

నల్లపాడు: పంట దిగుబడి రాలేదని మిర్చి రైతు ఆత్మహత్య

image

మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు కన్నయ్య వెంగళాయపాలెం దగ్గర నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని అందులో మిర్చి పంట వేశాడు. సరైన దిగుబడి రాకపోవడం వలన తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య శాంతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 16, 2024

స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాష, ఎస్పీ రకుల్ జిందాల్ చెప్పారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. రూములు వద్ద తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఈవీఎం బాక్స్‌లను తరలించడానికి వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాక్సులు తరలించేటప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.

News April 15, 2024

నూతక్కిలో 58 మంది వాలంటీర్లు రాజీనామా

image

మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని సచివాలయం-1, 2 పరిధిలోని వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పేదలకు సేవ చేయలేనప్పుడు తాము వాలంటీర్లుగా కొనసాగలేమని, అందుకే తమకు తాము రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. గ్రామంలోని 58 మంది వాలంటీర్లు రాజీనామా లేఖలను సంబంధిత అధికారులకు అందజేశారు. 

News April 15, 2024

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

పొన్నూరు పట్టణ శివారు జీబీసీ రోడ్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ప్రశాంత్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక యువకుడు మన్సూర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పొన్నూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 15, 2024

కర్లపాలెంలో 29 మంది వాలంటీర్లు రాజీనామా

image

కర్లపాలెం పంచాయతీలోని 29 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఎంపీడీవో నేతాజీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామన్నారు. అలాంటి తమపై పలువురు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. అందువల్లే రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.

News April 15, 2024

గుంటూరు: టీడీపీ ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలు

image

పలువురు టీడీపీ ముఖ్య నాయకులకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా, సత్తెనపల్లి-కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గుంటూరు వెస్ట్-తాడిశెట్టి మురళీమోహన్, నరసరావుపేట- నల్లపాటి రాములను కార్యనిర్వాహక కార్యదర్శులుగా, మాచర్ల-కళ్ళం రామాంజిరెడ్డి, పంగులూరు అంజయ్యను పార్టీ కార్యదర్శులుగా నియమించారు.

News April 15, 2024

గుంటూరు: రైలు ప్రమాదంలో మహిళ మృతి

image

గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ సమీపంలో నిన్న జరిగిన <<13050560>>రైలు ప్రమాదం<<>>లో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం వేముల ప్రియాంకగా గుర్తించారు. ఉద్యోగరీత్యా భర్త జితేంద్రతో కలిసి జడ్చర్లలో ఉంటున్నారు. ఇటీవల భర్త తిరుపతికి వెళ్లగా ఆమె వారి బంధువులను చూసేందుకు గుంటూరు వెళ్లింది. తిరిగి జడ్చర్లకు వస్తుండగా గద్వాల వద్ద రైలు నుంచి కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 15, 2024

గుంటూరు: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

గుంటూరు నల్లకుంటకు చెందిన తొనుగుంటల సాయి రాజేశ్ (25) చిలకలూరిపేట సమీపంలోని ఓ కళాశాలలో 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 6 నెలల కిందట ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు లాల్‌పురం పొలాల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 15, 2024

నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి

image

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్‌ను రాష్ట్ర అధిష్ఠానం ఎన్నుకున్నట్లు కొమ్మలపాటి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, పార్టీ అభివృద్ధి గెలుపుకు కృషి చేస్తానని కొమ్మాలపాటి అన్నారు. అయితే పలువురు పార్టీ పెద్దలు అతనికి అభినందనలు తెలిపారు.

News April 15, 2024

గుంటూరు: రూ.100 కోసం ఘర్షణ.. ఒకరి మృతి

image

పాత గుంటూరులో ఆదివారం  ఘోర ఘటన చోటుచేసుకుంది. పాతగుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు యాదవుల బజారుకు చెందిన దూళ్ళ ప్రభాకర్ (40) స్నేహితుడు పోగుల రాంబాబు వద్ద రూ.100 అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31న తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని ప్రభాకర్‌ను రాంబాబు అడిగాడు. ఈ విషయంలో గొడవ పెద్దదై రాంబాబు పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో ప్రభాకర్ తలపై కొట్టాడంతో తలలో రక్తం గడ్డకట్టి చనిపోయాడు.