Guntur

News May 14, 2024

వేమూరు మండలంలో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి

image

మండలం పరిధిలోని బూతుమల్లి వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే బూతుమల్లికి చెందిన గోగినేని వెంకటేశ్వరరావు(58) ప్రమాదవశాత్తు తెనాలి నుంచి రేపల్లె వెళ్లే రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యా కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 14, 2024

మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారు: అంబటి

image

జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారన్నారు. పోలింగ్‌ శాతం పెరగడం అంటే అది పాజిటివ్‌ ఓటింగ్‌ అని, మహిళా సాధికారత కోసం జగన్‌ కృషి చేశారన్నారు. మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి అన్నారు.

News May 14, 2024

తెనాలి ఘటన.. సుధాకర్‌కు జీజీహెచ్‌లో చికిత్స

image

నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెనాలి ఘటనలో ఓటరు సుధాకర్‌కు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఇతడిని కొట్టడం, తిరిగి ఇతను ఎమ్మెల్యేను కొట్టడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, సుధాకర్ సివిల్ ఇంజినీర్. హైదరాబాద్, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేసి.. ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నారు. ఓటు వేయడానికి ఆయన సోమవారం బెంగళూరు నుంచి వచ్చినట్లు తెలిసింది.

News May 14, 2024

మాదలలో ఇరువర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు

image

ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి వరకు వైసీపీ, టీడీపీ వర్గాలు దాడులకు దిగాయి. పోలింగ్ బూత్‌లో నెలకొన్న వివాదంతో పోలింగ్ ముగిశాక ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలు సోడాసీసాలు, రాళ్లు రువ్వుకుంటూ గ్రామంలో అలజడి సృష్టించాయి. ఈ క్రమంలో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

News May 14, 2024

పెదకాకాని: స్ట్రాంగ్ రూములకు ఈవీఎంల తరలింపు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. సోమవారం రాత్రి భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలింగ్ సిబ్బంది నుంచి ఈవీఎంలను తీసుకునే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ దూది, మంగళగిరి ఆర్వో జి.రాజకుమారి పాల్గొన్నారు.

News May 14, 2024

కారంచేడు: భర్త మృతి.. ఆ బాధలోనూ ఓటేసిన భార్య

image

బాపట్ల జిల్లా కారంచేడులో ఓ మహిళ ఓటు విలువను చాటారు. గర్నెపూడి చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా పని చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో సోమవారం ఆమె భర్త సింగయ్య(62) మృతిచెందారు. కాగా, ఆ బాధలోనూ ఆమె ఓటు వేయాల్సిన బాధ్యతను మరవలేదు. 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసి పలువురికి ఆమె ఆదర్శంగా నిలిచారు.

News May 14, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు టాప్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. తాజా సమాచారం మేరకు.. వేమూరులో అత్యధికంగా 85.02% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా గుంటూరు వెస్ట్‌లో 66.24% మంది ఓటేశారు. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 13, 2024

గుంటూరు: పోలింగ్ సరళి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన

image

జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పరిశీలించారు. కలక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ & కంట్రోల్ సెంటర్ నుంచి ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా , కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దూడి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) పవార్ స్వప్నీల్ జగన్నాథ్ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచన చేశారు.

News May 13, 2024

మాచర్ల: టీడీపీ, వైసీపీ అభ్యర్థుల హౌస్ అరెస్ట్

image

మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల విధ్వంసాలు జరగడంతో ఎన్నికల అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన గృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల పట్టణంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డిని పోలీసులు ఓ ప్రైవేటు గృహంలో నిర్బంధించారు.

News May 13, 2024

ఓటు వేయడం మనందరి బాధ్యత: వేణుగోపాల్

image

ఓటు వేయడం మనందరి బాధ్యత అని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 171వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.