Kurnool

News July 20, 2024

కర్నూలులో సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజుయాదవ్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ నేతలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని రాజుయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 20, 2024

నేను ఇంటర్ ఈ కాలేజ్‌లోనే చదివా: కర్నూల్ ఎంపీ

image

టౌన్ మోడల్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఇదే కళాశాలలో తాను ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశానని గుర్తుచేశారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవసరమైతే ఎంపీ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని ప్రకటించారు.

News July 20, 2024

కర్నూలు జిల్లాలో 21 మండలాల్లో వర్షం

image

అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 21 మండలాల్లో వర్షం కురిసింది. దేవనకొండలో అత్యధికంగా 22.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదోని 16.2, పత్తికొండ 8.0, క్రిష్ణగిరి 6.6, అస్పరి 6.2, మద్దికెర 5.6, కౌతలం 4.2, గోనెగండ్ల 3.8, తుగ్గలి 3.4, కర్నూలు అర్బన్ 0.8, సి.బెళగల్‌లో 0.2 మి మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 3.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News July 20, 2024

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

image

అగ్నివీర్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారిణి పి.దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. 21ఏళ్లలోపు వయసు, కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హతలు ఉండాలన్నారు. ఆన్లైన్‌లో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.

News July 20, 2024

ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా బాధ్యతల స్వీకరణ

image

డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ పీఎస్ షావలి ఖాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో బోటనీ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు పాల్గొన్నారు.

News July 19, 2024

ఆళ్లగడ్డలో జబర్దస్త్ నటుడు సద్దాం సందడి

image

ఆళ్లగడ్డలో ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ సద్దాం శుక్రవారం సందడి చేశారు. పట్టణానికి విచ్చేసిన సద్దాంతో జనసేన నాయకుడు మాబు హుస్సేన్‌ భేటీ అయ్యారు. సద్దాం మాట్లాడుతూ.. తన సొంతగడ్డ ఆళ్లగడ్డలో జన సైనికులను కలవడం ఆనందంగా ఉందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ టీంతో కలిసి తన వంతు ప్రచారం చేశానన్నారు. నేడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.

News July 19, 2024

తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయండి: ఎమ్మెల్సీ

image

అమరావతి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్సీ బీటీ నాయుడు కలిశారు. కర్నూలు జిల్లాలోని తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు బీటీ నాయుడు తెలిపారు. అనంతరం రాష్ట్రం గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.

News July 19, 2024

కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు

image

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నకిలీ పత్రాలతో తమ భూమిని కాజేశారని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌లో వారు ఈ ఫిర్యాదు చేశారు. పరిష్కారానికి మంత్రి అధికారులతో మాట్లాడారు.

News July 19, 2024

విద్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం: ఎంపీ

image

విద్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. గురువారం కర్నూలు సమీపంలోని ట్రిపుల్ ఐటీని ఆ కళాశాల రిజిస్ట్రార్ గురుమూర్తితో కలిసి పరిశీలించారు. కళాశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీకి రిజిస్ట్రార్ గురుమూర్తి విన్నవించారు. విద్యారంగాల సమస్యలను పరిష్కరించాలని ఇటీవలే మంత్రి లోకేశ్‌ను కలిసి విన్నవించాలని ఎంపీ అన్నారు.

News July 19, 2024

సైబర్ వలలో లద్దగిరి సర్పంచ్

image

కోడుమూరు మండలం లద్దగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ హనుమంతు బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు మాయం చేశారు. బాధిత సర్పంచ్ మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంకులోని తన వ్యక్తిగత ఖాతా నుంచి బుధవారం రాత్రి పదేపదే మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు. తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోగా రూ.1.95 లక్షల నగదు మాయం అయినట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైబర్ మోసంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.