Kurnool

News June 11, 2024

కర్నూలు: పదవులపై తీవ్ర ఉత్కంఠ.. మంత్రి యోగం ఎవరికో..?

image

కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కోట్ల జయప్రకాశ్‌ రెడ్డి సీనియర్‌ నేతగా గుర్తింపు పొందగా.. బీసీ జనార్దన్‌రెడ్డి అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆర్యవైశ్య కోటాలో టీజీ భరత్‌ పేరు వినిపిస్తోంది. ఎమ్మెల్సీల కోటాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు పేరూ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా ముగ్గురికి మంత్రి పదవులు రావొచ్చని తెలుస్తోంది.

News June 11, 2024

శ్రీశైలంలో వైభవంగా స్వామి,అమ్మవార్లకు వెండి రథోత్సవం

image

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ, వెండి రథోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. శ్రీస్వామి,అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసి ఊయలసేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు.

News June 10, 2024

రుద్రవరం: వీఆర్‌ఏ ఆకస్మిక మృతి

image

రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామ వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న పీరు బై(47) సోమవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు వీఆర్వో హుస్సేన్ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందారన్నారు. వీఆర్ఏ మృతదేహానికి తహశీల్దార్ మురళిమోహన్ పూలమాలవేసి నివాళులర్పించారు. 

News June 10, 2024

కర్నూలు: రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ రాజీనామా

image

మద్దికేర మండల కేంద్రానికి చెందిన రేలంపాడు వెంకటేశ్వర్లు రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్‌గా గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహించారు. అయితే సోమవారం రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను జల వనరుల శాఖ ప్రధాన కార్యదర్శికి పంపారు.

News June 10, 2024

కర్నూలు: TDP నేత హత్య.. రాత్రికి రాత్రే.. సీఐ, ఎస్సైల బదిలీ

image

వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో నిన్న రాత్రి టీడీపీ నేత గిరినాథ్ చౌదరి హత్య నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో వెల్దుర్తి సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ రెడ్డిని VRకు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. నూతన సీఐగా కర్నూలు సర్కిల్ పోలీస్ స్టేషన్ నుంచి మధుసూదన రావు, ఎస్సైగా కర్నూలు నాల్గో పట్టణ పోలీస్ ష్టేషన్ నుంచి సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

News June 10, 2024

కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం

image

మంత్రాలయంలోని తుంగభద్ర నది ఒడ్డున ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై గోపీనాథ్ తెలిపారు. హెచ్ఆర్‌బీ కళ్యాణ మండపం వెనుక భాగంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున రెండు బండరాళ్ల మధ్యలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవని, ఎవరికైనా తెలిసి ఉంటే వివరాలు తెలియజేయాలని కోరారు.

News June 10, 2024

JEE అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థుల ప్రతిభ

image

JEE అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. టాప్-10లో 2 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఆదోనికి చెందిన బీ.సందేశ్‌ 360 మార్కులకు 338 సాధించి మూడో ర్యాంకు, కర్నూలు గణేశ్‌నగర్‌కు చెందిన కే.తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరుకు చెందిన పీ.రాజేశ్ కుమార్ 36వ, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన ఎం.యశ్వంత్ రెడ్డి 50వ ర్యాంకులు పొందారు.

News June 10, 2024

కర్నూలు: నీటి కుంటలో పడి బాలుడి మృతి

image

హాలహర్వి మండలం నిట్రవట్టిలో మనోజ్ కుమార్(9) అనే బాలుడు ఆదివారం నీటి కుంటలో పడి మృతిచెందాడు. గ్రామంలోని వడ్డే మల్లికార్జున, మీనాక్షి దంపతులకు ముగ్గురు సంతానం. మూడో సంతానం మనోజ్ కుమార్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News June 10, 2024

YCP, TDPలకు SDPI గట్టి పోటీ ఇచ్చింది: జాతీయ కార్యదర్శి అబ్దుల్ సత్తార్

image

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో YCP, TDPలకు SDPI గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహబూబ్ బాషా అధ్యక్షతన శ్రీశైలం నియోజకవర్గ నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వార్డు, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు.

News June 10, 2024

రాష్ట్ర డీటీఎఫ్ కమిటీలో జిల్లా వాసులకు చోటు

image

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవాడలోని ఎన్జీవో హోంలో జరిగాయి. ఈ కౌన్సిల్‌లో రాష్ట్ర కమిటీలోకి కర్నూలు జిల్లాకు చెందిన కరె కృష్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా గట్టు తిమ్మప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సంఘం నాయకులు తెలిపారు. ఎన్నికైన వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.