Kurnool

News May 29, 2024

కర్నూలు: ఎఫ్.పి.షాప్ డీలర్ మహమ్మద్ బాషా మృతి

image

తుగ్గలికి చెందిన ఎఫ్.పి. షాప్ డీలర్ మహమ్మద్ బాషా (70) అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వైద్య చికిత్సల కోసం కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు పొందుతూ బాషా బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎఫ్.పి. సంఘానికి, పత్తికొండ నియోజకవర్గానికి బాషా ఎనలేని సేవలందించాడు. బాషా మృతితో గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.

News May 29, 2024

నంద్యాల: ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు

image

ప్రతి హాల్ కు 14 టేబుళ్లు చొప్పున రౌండ్ల వారిగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74, పార్లమెంటుకు 75 టేబుళ్లు, పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21, పార్లమెంటుకు 17 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశామన్నారు. 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా ఉంటాయన్నారు.

News May 29, 2024

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

image

దీల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్, భద్రతా ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, తదితరులు పాల్గొన్నారు.

News May 29, 2024

కర్నూలు: 27,998 ఆరోగ్య శ్రీ కేసులతో ప్రథమ స్థానం

image

కర్నూలు సర్వజన వైద్యశాలలో గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు 27,998 ఆరోగ్యశ్రీ కింద కేసులు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోని ధన్వంతరీ హాలులో అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.2 కోట్ల విలువైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

News May 29, 2024

కర్నూలు: 19 లక్షల పత్తి విత్తన ప్యాకెట్ల సరఫరాకు చర్యలు

image

కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.50 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లు హెక్టార్ కు 8 అవసరం కాగా, జిల్లాలో సాగుకు సంబంధించి 20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంది. జిల్లాకు 16 పత్తి విత్తన కంపెనీలు 19 లక్షల విత్తన ప్యాకెట్లను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు నివేదించాయి.

News May 29, 2024

కర్నూలు: తుంగభద్రలో మొసలి కలకలం

image

నందవరం మండలం నాగలదిన్నె సమీపంలో తుంగభద్ర నదిలో మంగళవారం ఓ మొసలి కనిపించింది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదిలో నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీటిలో మొసలి కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నాగలదిన్నె వంతెనపై వెళ్తున్న ప్రజలు నది మధ్యలో తిరుగుతున్న మొసలిని చూశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

News May 29, 2024

ఎన్నికల్లో నాదే విజయం: బుడ్డా రాజశేఖర్ రెడ్డి

image

జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో విజయం తనదేనని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తనకోసం పనిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News May 29, 2024

కొలిమిగుండ్ల : పెట్నికోట కేసులో మొత్తం 54మంది నిందితుల అరెస్ట్

image

కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట గ్రామంలో మే-13న పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న గొడవకు సంబంధించి మొత్తం 54మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇందులో టీడీపీ, వైసీపీ వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం అరెస్టు చేసిన నిందితులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 54మంది నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

News May 28, 2024

నంద్యాల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈనెల 26న భార్య వడ్డే సుగుణమ్మను దారుణంగా హత్య చేసిన భర్త వడ్డే రమణయ్యను మంగళవారం అరెస్టు చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథరెడ్డి వెల్లడించారు. తనను ఒంటరి వాడిని చేసి తరచూ గొడవ పడుతుందన్న కారణంతోనే నిద్రిస్తున్న భార్య సుగుణమ్మపై పదునైన కర్రతో కొట్టి చంపాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు

News May 28, 2024

కర్నూలు: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. మంత్రాలయం మండలం సుగూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ (18) రేకుల షెడ్డులోని పశువులకు మేపు వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. రేకుల షెడ్డుకు విద్యుత్ ఎర్త్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.