Andhra Pradesh

News April 8, 2024

కాట్రేనిపాడులో యువకుడిపై దాడి

image

ముసునూరు మండలం కాట్రేనిపాడులో యువకుడిపై దాడి చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ముసునూరు గ్రామానికి చెందిన రత్నకుమార్(21) మూడు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రాత్రి తన కుమార్తె నువ్వు లేకపోతే చనిపోతానని అంటోందని రత్నకుమార్‌ను పిలిపించారు. బాలిక, ఇంటికి వచ్చిన యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని రత్న కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.  

News April 8, 2024

ప్రకాశం: గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

image

గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి చెందిన ఘటన సోమవారం తర్లుపాడు మండల పరిధిలోని మంగళ కుంటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేశ బోయిన పెద్ద కాశయ్య మల్లమ్మ బోడు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News April 8, 2024

కోనసీమ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

image

కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అమలాపురం పట్టణాల్లో ఈ నెల 11వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సభ నిర్వహణకు ముందు ఇరుపార్టీల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందన్నారు.

News April 8, 2024

ప.గో.: ఘోరం.. ACCIDENTలో ఇద్దరు మృతి

image

ప.గో. జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి పెట్రోల్ బంకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో.జిల్లా నుంచి కొబ్బరి దింపు కార్మికులు కాజ వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి కాకినాడ వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తూ.గో. జిల్లా గుడిమూడులంకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. యలమంచిలి ఎస్సై శివనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

పెనుకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి మృతి

image

పెనుకొండ మండల జెడ్పీటీసీ గుట్టూరు శ్రీ రాములు గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. గతంలో ఆయన 2005లో పెనుకొండ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో క్రియాశీలకంగా పని చేశారు. గత కొంత కాలం కిందట గుండె పోటుకు గురయ్యారు. అయితే హఠాత్తుగా ఆయన మృతి చెందారు.

News April 8, 2024

టీచర్ల విదేశీ ప్రయాణల అనుమతులు రద్దు

image

ఎన్నికల నేపథ్యంలో టీచర్ల విదేశీ ప్రయాణ అనుమతులను రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో వారిని నియమించి శిక్షణ ఇస్తున్నారు. మే 13లోపు విదేశాలకు వెళ్లేందుకు పొందిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 13న పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లే అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్లో సమర్పించాలని డీఈవో సుభద్ర తెలిపారు.

News April 8, 2024

విశాఖ రైల్వే స్టేషన్‌లో పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో మూడవ ఎంట్రన్స్ ఎదురుగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కుంగిన ఫుట్ ఓవర్ వంతెన మీద రాకపోకలను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు తెలిపారు. దీని మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

News April 8, 2024

జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా.. కాసేపట్లో ప్రెస్ మీట్

image

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ తన తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. పార్టీలోని పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. పోతిన మహేశ్ ఏ నిర్ణయం తీసుకుంటారో, అది వెస్ట్‌లో కూటమిపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News April 8, 2024

విజయనగరం: ట్రైన్ కిందపడి మహిళ మృతి

image

విజయనగరం నుంచి రాయగడ మార్గంలో పెదమానాపురం వద్ద సోమవారం ట్రైన్ కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. అక్కడ పనిచేస్తున్న రైల్వే సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా

image

జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేశ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌కు లేఖ రాశారు. జనసేన పార్టీలో తనకున్న పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించగా, ఆ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.