Andhra Pradesh

News March 21, 2024

సోషల్ మీడియాలో పోస్టు.. కురుపాం ఎంఎన్ఓ సస్పెన్షన్

image

కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఎన్ఓగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ కిరణ్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ జి.కేశవ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసినందుకు గాను కిరణ్ కుమార్‌ను సస్పెండ్ చేశామన్నారు. ఈ మేరకు కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News March 21, 2024

నరసరావుపేటలో గోపిరెడ్డిదే రికార్డ్ మెజార్టీ

image

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికల జరిగాయి. గత ఎన్నికల్లో గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ఇప్పటి వరకు భారీ మెజార్టీ. టీడీపీ అభ్యర్థిపై ఆయన 32,277 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు(1985)ది అత్యల్ప మెజార్టీ 2,065. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి గోపిరెడ్డి బరిలో ఉండగా, TDP కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

News March 21, 2024

మందస: ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

image

మండలంలోని భోగాపురం పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అగ్గున్న దేవేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకుడు జివి.చిట్టిరాజు గురువారం తెలిపారు. దేవేంద్ర రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ దాన్ని ధ్రువీకరించారు. దీంతో దేవేంద్రను సస్పెండ్ చేశారు. 

News March 21, 2024

మెలియాపుట్టి: రాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా

image

రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒడిశా చెక్‌పోస్టు వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ అన్నారు. మెలియాపుట్టి మండలం వసుంధర గ్రామం వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దును గురువారం కలెక్టర్ పరిశీలించారు. సరిహద్దుపై నిఘా నిరంతరం ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులతో సమీక్ష చేశారు. ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు.

News March 21, 2024

చిత్తూరు: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట..

image

బైరెడ్డిపల్లి పోలీసులను ఓ ప్రేమజంట గురువారం ఆశ్రయించారు. రామసముద్రంకు చెందిన యువకుడు, తీర్థం గ్రామానికి చెందిన యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమికుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. 

News March 21, 2024

విజయనగరం: నీళ్ల ట్యాంకులో పడి బాలుడు మృతి

image

తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోడానికి వెళ్లిన దాసరి సిద్దు(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు స్నానాలు చేసే నీళ్ల ట్యాంకులో పడి మృతి చెందిన సంఘటన భోగాపురం మండలం దెబ్బలపాలెంలో చోటుచేసుకుంది. బొబ్బిలికి చెందిన దాసరి నరసింహారావు భార్యాబిడ్డలతో కూలి పనుల కోసం భోగాపురం వచ్చారు. వారు పనులు చేస్తుండగా కుమారుడు ఆడుకోవడానికి వెళ్లి ట్యాంక్‌లో పడి చనిపోయాడని వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 21, 2024

వాలంటీర్లపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే క్రిమినల్ కేసులో నమోదు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 4 రోజులు గడిచినా ఎన్నికల కోడ్‌కు సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఈపాటికే తీసేసి ఉండాల్సిందన్నారు. ఇప్పటికి తీసేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 21, 2024

గుంటూరులో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి చిన్నారి మృతి

image

గుంటూరు రూరల్ మండలం పెద్దపలకలూరు గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ కోసం తీసిన గుంతలో పడి చిన్నారి మృతిచెందింది. ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలోని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఆరేళ్ల కుమార్తె గుంతలో పడి చనిపోగా, నల్లపాడు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న వారు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబానిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓ గ్రామం. 

News March 21, 2024

కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డికి నోటీసులు

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.మాధవిరెడ్డికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి & రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం మాధవిరెడ్డి సోషల్ మీడియాలో ఎంసీసీని ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

కాకినాడ: భానుగుడి సెంటర్లో వ్యభిచారం

image

కాకినాడ భానుగుడి సెంటర్లో కోటగిరి సిటీ కాంప్లెక్స్‌లోని ఈసా స్పా సెంటర్లో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని కాకినాడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తాకు చెందిన ఒక మహిళతో పాటు ఇద్దరు విటులను, ఇద్దరు స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారని టౌన్ సీఐ నాయక్ తెలిపారు.