Visakhapatnam

News May 25, 2024

విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తండ్రి మందలించడంతో కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం సింగిరెడ్డివలసకు చెందిన విద్యార్థిని (17) విశాఖలోని మహారాణిపేట బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్ ఫెయిల్ అయిన విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం మహారాణిపేట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News May 25, 2024

విశాఖలో నేడు డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విశాఖ జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతుందని, మొత్తం 4,498 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీ.ఆర్.ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు.

News May 24, 2024

కొమరవోలులో పిడుగు పడి మహిళా రైతు మృతి

image

రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన గణేశ్వరి(39) పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తనకు ఉన్న పశువులను మేతకు తీసుకువెళ్ళింది. వాటిని మేపుకుంటూ పొలం వద్ద ఉండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో గణేశ్వరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త తమ్మునాయుడుతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

News May 24, 2024

కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

image

విశాఖ ఆంధ్రా యూనివ‌ర్సిటీ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నిక‌ల అధికారి క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున శుక్రవారం మ‌ధ్యాహ్నం ప‌రిశీలించారు. పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎ. ర‌విశంక‌ర్‌తో క‌లిసి పార్లమెంట్, అసెంబ్లీ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల‌ను త‌నిఖీ చేసిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. భ‌ద్ర‌తాప‌ర‌మైన ఏర్పాట్లను ప‌రిశీలించారు.

News May 24, 2024

సింహాచలం: నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 24, 2024

విశాఖ: తహశీల్దార్ హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News May 24, 2024

విశాఖ: సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి

image

కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

News May 23, 2024

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు

image

విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలును ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా, గుణుపూరు నుంచి విశాఖకు వచ్చే పాసింజర్ ట్రైన్ ఈ నెల 24 నుంచి 27 వరకు రద్దు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-పలాస మధ్య నడిచే పాసింజర్ ట్రైన్‌ను ఈ నెల 27న రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

News May 23, 2024

విశాఖ: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్

image

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ ఏర్పాటయింది. జాయింట్ సీపీ, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్స్ దీనిలో ఉంటారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆదేశించారు. కాగా ఆపరేషన్ కంబోడియా విజయవంతమైందని అధికారులు తెలిపారు. 360 మంది భారతీయులను ఎంబసీ ఆఫ్ ఇండియా కాపాడింది.

News May 23, 2024

సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందనం సమర్పణ

image

వైశాఖ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సమర్పణను వైభవంగా నిర్వహించారు. మొదటి విడత మే 10వ తేదీన 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించగా, రెండో విడత గురువారం మరో 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించారు. పలువురు భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.