Visakhapatnam

News October 27, 2024

ఎస్.రాయవరం: సముద్ర తీరంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

image

ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయినట్లు మెరైన్ ఏఎస్ఐ కృష్ణ తెలిపారు. కోరుప్రోలు గ్రామానికి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయనగరం నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు తీరంలో విహారయాత్రకు వెళ్లారు. వారిలో టి.అర్జున్, బి.బబ్లు సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు పేర్కొన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News October 27, 2024

ఏయూ: బీబీఏ-ఎంబీఏ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బీబీఏ-ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సు నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. జూలై నెలలో జరిగిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు నవంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చు.

News October 27, 2024

ఏయూ: న్యాయవిద్య సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

ఏయూలో 5, 3 సంవత్సరాల న్యాయ విద్య సెల్ఫ్ సపోర్ట్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ డీ.ఏ నాయుడు తెలిపారు. ఏపీ లా సెట్, క్లాట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు నవంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.

News October 27, 2024

విశాఖ డెయిరీకి నోటీసులు

image

భీమిలి మండలం చినగదిలి పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిన విశాఖ డెయిరీకి శనివారం జీవీఎంసీ సహాయ ప్రణాళిక అధికారి శాస్త్రి నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ ప్రాంతంలో వసతి గృహాలు, పశువుల షెడ్లు, ఇతర భవనాలు ఉన్నట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు వారంలోగా సమర్పించాలని కోరారు.

News October 27, 2024

విశాఖ: ‘డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

డయేరియా పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశించారు. శనివారం ఆయన సాగర్ నగర్, బాలాజీ నగర్‌లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి డయేరియా లక్షణాలు కనిపిస్తే సత్వర చికిత్స అందించాలన్నారు. సకాలంలో గర్భిణీలు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు.

News October 27, 2024

విశాఖ: 14న మెగా పేరెంట్-టీచర్స్ కమిటీ సమావేశాలు

image

వచ్చే నెల 14న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పేరెంట్-టీచర్స్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. సమావేశాల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ క్రియేట్ చేయాలన్నారు.

News October 26, 2024

విశాఖ: తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసిన ఆంధ్ర

image

ఆంధ్ర-హిమాచల్ ప్రదేశ్ గ్రూప్-బి రంజీ ట్రోఫీ మ్యాచ్ శనివారం విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి హిమాచల్ ప్రదేశ్ బౌలింగ్ ఎన్నుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు తొలిరోజు ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లకు 295 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఎస్.కె.రషీద్ 132 బంతుల్లో 9 ఫోర్‌లతో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేఎస్ భరత్ 65 పరుగులు చేశాడు.

News October 26, 2024

విశాఖ: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా హిందుస్థాన్ షిప్ యార్డ్

image

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా ముందడుగు వేస్తోంది. సముద్రంలో ఉపయోగించే పరికరాలకు గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికతను కొరియన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, లోటస్ వైర్ లెస్ ప్రైవేట్ సంస్థతో కలిసి తయారు చేసినట్లు హిందుస్థాన్ షిప్ యార్డ్ తెలిపింది. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ పనిచేస్తుందని తెలియజేసింది.

News October 26, 2024

అరకు: విషాదం.. టెన్త్ విద్యార్థి మృతి

image

అరకులోయలో విషాదం నెలకొంది. గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విజయ కుమార్(15) చనిపోయాడు. ఈ నెల 22న విద్యార్థి అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ముంచంగిపుట్టు మండలం పొల్లిపుట్టు గ్రామానికి చెందిన విద్యార్థిని పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టడం వల్ల అనారోగ్యానికి గురై, మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News October 26, 2024

టెస్ట్ టీమ్‌లో విశాఖ కుర్రాడు నితీశ్

image

మన విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్‌‌కు టెస్ట్ టీమ్‌లోకి పిలుపువచ్చింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో నితీశ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ఇటీవల టీ20 అరంగేట్రం చేసిన అతడు త్వరలోనే టెస్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్ట్‌‌లలో రాణించి జాతీయ జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని అభిమానులు, విశాఖ వాసులు కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.