Vizianagaram

News July 29, 2024

విజయనగరం: అతిథులొచ్చేశాయ్..!

image

విజయనగరం అయ్యకోనేరు చెరువులో సైబీరియన్‌ పక్షులు కనువిందు చేశాయి. వీటిని నగర వాసులు అతిథులుగా భావిస్తారు. ఏటా వర్షాకాలంలో ఈ పక్షులు తమ ప్రాంతానికి వస్తూ సందడి చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. వీటి సంరక్షణ కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అతిథులు మనుగడ కోల్పోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News July 29, 2024

ఒలింపిక్స్ క్రీడాకారులకు అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు

image

ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా క్రీడాకారులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒలింపిక్‌ క్రీడాకారులకు మద్దతుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తీసుకొచ్చిన చీర్‌ ఫర్‌ భారత్‌ సెల్ఫీపాయింట్‌ను ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

News July 28, 2024

VZM: ‘ఆగస్టు 9న సెలవు దినంగా ప్రకటించాలి’

image

ఏటా ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది . GO-3ను పక్కాగా అమలు చేయాలని, గిరిజన హక్కులు, చట్టాలను కాపాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. రోజురోజుకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

News July 28, 2024

పాచిపెంట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పాచిపెంట మండలం పద్మపురానికి చెందిన కంటా రమేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ నెల 23న పనులు నిమిత్తం వెళ్లిన రమేశ్ ఇంటికి రాకపోవడంతో తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈమేరకు ఒడిశా సరిహద్దు ప్రాంతం ఈతమనువలస సమీపంలో ఆదివారం మృత దేహాన్ని గుర్తించి, పోస్ట్ మార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News July 28, 2024

గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

ఏలూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో గరుగుబిల్లి మండలం పెద్దూరుకు చెందిన కృష్ణమ్మ(60) మృతి చెందారు. పార్వతీపురం జిల్లాకు చెందిన 31 మంది భక్త బృందం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలవర్రు వద్ద ఆగిన లారీని బస్సు ఢీకొనడంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News July 28, 2024

VZM: జిల్లాకు 480 మెట్రిక్‌ టన్నుల డీఏపీ

image

ఖరీఫ్‌ సీజన్‌‌లో రైతులకు పంపిణీ చేసే నిమిత్తం 480 మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఎరువులతో కూడిన గూడ్సు రైలు వ్యాగన్‌ క్రిభ్‌కో కంపెనీ నుంచి జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆదివారం తెలిపారు. ఈ ఎరువులను ఇప్పటికే జిల్లాలోని 38 రైతుసేవా కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

News July 28, 2024

బొత్స వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కొండపల్లి

image

నెల్లిమర్ల మండలం ధనాలపేటలో మాజీ సైనికుడు పతివాడ వెంకునాయుడు ఇంటిని కూల్చారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. అశోక్ బంగ్లాలో ధనాలపేట గ్రామస్థులతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం వలన మాత్రమే ప్రహరీ గోడ కూల్చడం జరిగిందన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

News July 28, 2024

VZM: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సూసైడ్

image

కర్నూలు పరిధి జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కుదమకి చెందిన ఎన్‌.సాయికార్తీక్‌ నాయుడు(20) ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలోని హాస్టల్‌లోని 9వ అంతస్తు పైనుంచి దూకాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సివుంది. కాగా.. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్ ఉన్నట్లు సమాచారం.

News July 28, 2024

బొబ్బిలిలో అపరిచిత వ్యక్తి కలకలం

image

బొబ్బిలిలోని అమ్మిగారి కోనేరు సమీపంలోని అపార్టుమెంట్లోకి ఓ అపరిచిత వ్యక్తి శనివారం రాత్రి ప్రవేశించి కలకలం సృష్టించాడు. చంటి పిల్లలను ఎత్తుకెళ్లిపోవడానికి వచ్చాడని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. ఆ వ్యక్తిని వెంటనే పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్టేషన్లో అతడు గట్టిగా అరుస్తుండడంతో మతిస్థిమితం లేని వ్యక్తి కావచ్చని భావిస్తున్నారు.

News July 28, 2024

విజయనగరం ఎస్పీని కలిసిన మన్యం జిల్లా ఎస్పీ

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ ను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ఎస్పీలు కాసేపు చర్చించుకున్నారు. ఏఓబీ లోని మావోయిస్టుల కదలికలు, అంతర్ జిల్లాల పరిధిలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ఉమ్మడిగా తీసుకోవలసిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు.