news

News August 23, 2025

కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ఇప్పుడే కాదు: రాజీవ్‌ శుక్లా

image

వన్డేల నుంచి టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోరని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. వారిద్దరి రిటైర్మెంట్‌కు అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం కోహ్లీ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. అలాగే రోహిత్ కూడా బాగా రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారు రిటైర్మెంట్ కావాల్సిన అవసరం లేదు. దీనిపై కొందరు లేనిపోని వ్యాఖ్యలు చేయడం దారుణం’ అని ఆయన పేర్కొన్నారు.

News August 23, 2025

వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు పెంపు

image

20 ఏళ్లకు పైబడిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్రం భారీగా పెంచింది. టూ వీలర్‌కు ₹1000 నుంచి ₹2000కి, త్రీ వీలర్‌కు ₹3,500 నుంచి ₹5,000, లైట్ మోటార్ వెహికల్స్‌కి ₹5000 నుంచి ₹10వేలకు పెంచింది. ఇంపోర్టెడ్ 2, 3 వీలర్స్ ఫీజును ₹10k నుంచి ₹20kకి, ఇంపోర్టెడ్ 4 వీలర్లలకు ₹40k నుంచి ₹80kకి, మిగతా వాహనాలకు ₹6k నుంచి ₹12kకి పెంచినట్లు ప్రకటించింది. 15-20 ఏళ్ల వెహికల్స్‌కు ఎలాంటి పెంపు లేదు.

News August 23, 2025

సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

image

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) అనారోగ్యంతో <<17489969>>కన్నుమూసిన<<>> సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం నుంచి మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతిక కాయాన్ని ఉంచి, అనంతరం గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News August 23, 2025

నవంబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ!

image

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్‌లో ఇండియాకు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.

News August 23, 2025

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు

image

దేశంలోనే అత్యంత ధనిక CMగా చంద్రబాబు నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తెలిపింది. ఆయన ఆస్తులు రూ.931 కోట్లకుపైగా, అప్పులు రూ.10కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ CM పెమా ఖండ్ రెండో స్థానంలో, రూ.30 కోట్ల ఆస్తులతో రేవంత్ ఏడో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న CMగా మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలు మాత్రమే.

News August 23, 2025

10,834 ఎకరాల్లో కృష్ణపట్నం కారిడార్

image

AP: చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నిర్మించే కృష్ణపట్నం నోడ్‌ను 10,834 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 3 దశల్లో వివిధ అవసరాలకు వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 44.3% భూమిని పారిశ్రామిక అవసరాలకు, 13.8శాతం భూములను రోడ్ల నిర్మాణానికి, 11.1శాతం భూమిని పచ్చదనం అభివృద్ధికి ఉపయోగించనున్నారు.

News August 23, 2025

మెగాస్టార్ నుంచి 4 సినిమాలు.. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు?

image

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నలుగురు డైరెక్టర్లతో పనిచేస్తున్నారు. వశిష్ఠతో ‘విశ్వంభర’, అనిల్ రావిపూడితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ, ‘దసరా’ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలోనూ చేయబోతున్నట్లు ప్రకటించారు. చిరు-అనిల్ సినిమా సంక్రాంతికి, ‘విశ్వంభర’ వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత బాబీ, శ్రీకాంత్ సినిమాలు పట్టాలెక్కే అవకాశముంది.

News August 23, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. వైట్ బ్రెడ్, ప్యాకేజ్డ్ జ్యూసులు, డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ తీసుకోవద్దని, వీటి వల్ల బరువు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. పూరీలు, మైసూర్ బోండాలు, పరోటాలు, పకోడీలకు బదులు ఇడ్లీ, ఉప్మా, తక్కువ ఆయిల్‌తో చేసిన దోశలు తినాలని సూచిస్తున్నారు.

News August 23, 2025

ఫలితాలు విడుదల.. టాపర్లు వీరే

image

AP: DSC-2025 మెరిట్ లిస్టు PGT ప్రిన్సిపల్ జాబితాలో 75.5 స్కోరుతో చింతల గౌతమ్ టాపర్‌గా నిలిచారు. 73 స్కోరుతో జి.రాజశేఖర్ 2వ ర్యాంక్ సాధించారు. PGT ఇంగ్లిష్‌లో స్వరూప(87 స్కోరు), హిందీలో రమేశ్(93.5), సంస్కృతంలో భాను(94), తెలుగులో ధర్మారావు(85.5), బయాలజీలో శివకుమార్(81.5), గణితంలో విజయ్(78.5), ఫిజికల్ సైన్స్‌లో బాలకిశోర్(74.5), సోషల్‌లో నిరోష(85) టాపర్లుగా నిలిచారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 23, 2025

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. కేంద్రం క్లారిటీ

image

భారత్‌లో మళ్లీ<<17486073>> టిక్‌టాక్<<>> వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా కొనసాగుతోంది. దానిని అన్‌బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది. భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది.