news

News September 18, 2024

సింధు జలాల ఒప్పందంలో సవరణకు భారత్ ప్రతిపాదన

image

పాక్‌తో ఉన్న సింధుజలాల ఒప్పందంలో మార్పులు చేయాలని భారత్ యోచిస్తోంది. ఆ మేరకు ఆ దేశానికి తాజాగా నోటిఫై చేసింది. 6 దశాబ్దాల క్రితం ఇరు దేశాలు సింధు జలాల ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాని ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు, రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు చెందుతాయి. అయితే భారత వాటా నదుల్లో కూడా ప్రాజెక్టులు కట్టకూడదని పాక్ అభ్యంతరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ మార్పులు చేయాలనుకుంటోంది.

News September 18, 2024

‘ప్రకాశం’లో వైసీపీకి భారీ కుదుపు

image

AP: మాజీ మంత్రి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లాలో YCP భారీ కుదుపునకు గురైంది. ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని తప్పుకోవడంతో YCP చుక్కాని లేని నావలా తయారైంది. జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించిన ఆయన ఆ పార్టీని వీడడం YCPకి తీరని లోటే. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ సొంత కోటరీ ఏర్పాటు చేసుకున్న బాలినేని గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి బిగ్ మైనస్.

News September 18, 2024

చంద్రబాబుకి భయం లేదు: పవన్ కళ్యాణ్

image

AP: చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. NDA శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘CM చంద్రబాబు దార్శనికుడు. ఆయనకు భయం లేదు. ముందుచూపు ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదు. CBNను జైలులో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం’ అని తెలిపారు.

News September 18, 2024

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం: ఖర్గే

image

జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతు ఉండబోదని ప్రకటించారు. మల్టిపుల్ ఎన్నికలు నిర్వహించడంలో మోదీ, అమిత్ షాలకు ఏమైనా అభ్యంతరమా? అని ఆయన ప్రశ్నించారు.

News September 18, 2024

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన అనసూయ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సినీ నటి అనసూయ స్పందించారు. ‘‘పుష్ప’ సెట్స్‌లో ఆ అమ్మాయిని చూశా. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ప్రతిభను ఏమాత్రం తగ్గించలేవు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. మనసులో దాచుకోకుండా వెంటనే బయటపెట్టాలి. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి’ అని ఆమె పేర్కొన్నారు.

News September 18, 2024

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్: నారా లోకేశ్

image

AP: మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినట్లుగానే ఆయన హామీ నెరవేర్చారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన హామీలపై ఆయన వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

News September 18, 2024

పరిపాలనలో మాకు ఎలాంటి భేషజాలు లేవు: సీఎం రేవంత్

image

TG: రైతులకు రుణమాఫీ చేసినా వారి బాధలు తీరడం లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడకుండా కుటుంబంలోని ఇద్దరు నైపుణ్యాలు పెంచుకుని పరిశ్రమలు పెట్టాలి. యువతకు అన్నివిధాలా చేయూతనిస్తాం. గతంలో కృష్ణా జిల్లాలో ఎకరం అమ్మితే TGలో పది ఎకరాలు వచ్చేది. ఇప్పుడు TGలో ఎకరం అమ్మితే కృష్ణా జిల్లాలో పదెకరాలు వస్తుంది. పరిపాలనలో మాకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధిని కొనసాగిస్తాం’ అని తెలిపారు.

News September 18, 2024

OFFER: ఆ రోజున రూ.99కే సినిమా టికెట్

image

మూవీ లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న రూ.99కే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుంది. PVR ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీ టైమ్, డిలైట్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ కేటగిరీలకు వర్తించదు.

News September 18, 2024

రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు: బాలినేని

image

AP: YCPకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం YS జగన్‌కు లేఖ రాశారు. ‘రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించా. రాజకీయ నాయకులు భాషా గౌరవం కాపాడాలి. విలువలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. విలువలు నమ్ముకుని 5సార్లు MLA, 2సార్లు మంత్రిగా పని చేశానన్న కొంత తృప్తి, కొంత గర్వంగా కూడా ఉంది. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 18, 2024

వాటర్ బాటిల్స్ అమ్మే వ్యక్తి ఇండియాను గెలిపించాడు!

image

ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడంలో కీలకంగా ఆడిన భారత ప్లేయర్ జుగ్‌రాజ్ సింగ్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన జుగ్‌రాజ్ వాఘా బోర్డర్‌లో తన సోదరుడితో కలిసి పర్యాటకులకు వాటర్ బాటిల్స్ అమ్మేవారు. ఆర్థికంగా ఎన్నో ఆటంకాలున్నప్పటికీ వాటిని అధిగమించి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. నిన్న చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఆయన కొట్టిన గోల్ వల్ల ఇండియా ట్రోఫీని గెలుపొందింది.