news

News June 20, 2024

అశ్వినీ దత్ కాళ్లు మొక్కిన బిగ్ బీ.. RGV రియాక్షన్ ఇదే

image

‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వినీ దత్ కాళ్లకు నమస్కరించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘అమితాబ్ బచ్చన్ ఇలా చేయడం అశ్వినీదత్ సాధించిన విజయాల్లో అత్యున్నతం. NTR నుంచి తాజా యువ హీరోల వరకు ఎవరూ ఇలా చేసి ఉండరు. బిగ్ బీ తన కెరీర్ మొత్తంలో మరే ఇతర నిర్మాతకు ఇలా చేయడం నేను చూడలేదు’ అని ట్వీట్ చేశారు.

News June 20, 2024

సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్: చంద్రబాబు

image

AP: అమరావతి ఏపీ ప్రజలందరి చిరునామా అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. ‘జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. అమరావతిపై నిత్యం విష ప్రచారం చేశారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు’ అని అన్నారు.

News June 20, 2024

సంపద పెరిగినా ఆర్థిక అసమానతలు పోవా?

image

శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్ తన జోరును కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే ఆర్థిక అసమానతలను ఈ వృద్ధి తగ్గించలేదని అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ సంస్థ నిర్వహించిన పోల్‌లో నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలను ప్రధాన సమస్యగా పరిగణించట్లేదని పేర్కొన్నారు. కాగా వీరిలో పలువురు ఈ ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

News June 20, 2024

పదో తరగతి అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసై 18-26 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. జీతం రూ.19,500- రూ.37,815 వరకు అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 27లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్:https://ibpsonline.ibps.in/cbiskssnov23/

News June 20, 2024

ఐఐటీ బాంబేలో రామాయణానికి పారడీ.. విద్యార్థులకు ఫైన్

image

రామాయణం ఆధారంగా ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు వేసిన నాటకం విమర్శలకు దారి తీసింది. మార్చి 31న రాహోవన్ పేరిట చేసిన ఆ నాటకం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో నాటకం వేసిన వారిలో కొంతమందికి యాజమాన్యం తలా రూ.1.2లక్షల జరిమానా విధించింది. మరికొంతమందికి రూ.40వేలు, జూనియర్ స్టూడెంట్స్‌‌కు హస్టల్ నిషేధం వంటి శిక్షల్ని విధించింది.

News June 20, 2024

భారత్ సంపద 1000% పెరుగుతుంది: NSE MD

image

భారత్ సంపద మరో 50ఏళ్లలో 10రెట్లు (1000%) పెరుగుతుందని NSE ఎండీ ఆశీష్ కుమార్ అంచనా వేశారు. యువత ద్వారా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వీస్ సెక్టార్ భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్యం, రవాణాకు సంబంధించి దేశం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.

News June 20, 2024

NEETపై సీబీఐతో విచారణ జరిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ‘నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.

News June 20, 2024

భారత బౌలర్లందర్నీ లక్ష్యంగా చేసుకుంటా: గుర్బాజ్

image

T20 WC సూపర్‌-8లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకుంటానని అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘మేం ఏదో ఫార్మాలిటీకి ఆడట్లేదు. కప్ గెలవడం మా లక్ష్యం. టీం ఇండియా బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి పెంచుతా. అయితే ఔట్ అవుతా లేదా దూకుడుగా ఆడతా’ అని తెలిపారు.

News June 20, 2024

ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే: వైఎస్ జగన్

image

తాడేపల్లిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో తమ నేతలకు పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు. ‘శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు అప్పుడప్పుడూ ఓడిపోయారు. చివరికి ప్రతి ఒక్కరు అర్జునుడిలా విజయం సాధిస్తారు. 99శాతం హామీల అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం’ అని పేర్కొన్నారు.

News June 20, 2024

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ, కేజ్రీవాల్ తరఫు వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఢిల్లీ కోర్టు రిజర్వులో ఉంచింది.