India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానకుతోడు పిడుగులు పడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతాంగానికి వేదన మిగిల్చింది. మంచిర్యాల జిల్లాలో 27 స్తంభాలు, ఒక ట్రాన్స్ ఫార్మర్ నేలకూలడంతో విద్యుత్ శాఖకు రూ. 12 లక్షల నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి పంట నేలరాలడంతో రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన ఉట్నూరు దత్తాత్రి(46) ఆదివారం చేపల వేటకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం లింగా గ్రామ శివారులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తికి దత్తాత్రి మృతదేహం కనిపించింది. దీంతో భైంసా రూరల్ ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను ఓ మహిళ మోసం చేసిన ఘటన నిర్మల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ. 2-10లక్షల వరకు వసూలు చేసింది. ఆమె ఇచ్చిన ఆర్డర్ కాపీలతో ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా జరిగిన మోసం తెలుసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నకిలీ చెక్కులు రాసిచ్చి తప్పించుకుని తిరుగుతోందని బాధితులు వాపోతున్నారు.
భారతీయ జనతా పార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఖానాపూర్కు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు రితిష్ రాథోడ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక జంగల్ హనుమాన్ ఆలయం నుంచి ఖానాపూర్ బస్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఆయన పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ సప్లమెంటరీ సెకండ్ ర్యాండమైజేషన్ను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.
2024-25 విద్యా సం.నికి సంబంధించి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ సహాయ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. డిగ్రీలో ప్రవేశాల కోసం ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ సంబంధిత అనుమానాల నివృత్తి కోసం ఈ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని దోస్త్ కోఆర్డినేటర్ నర్సింగరావు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు.
బోథ్ మండలంలోని దనోరా గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను కలుస్తూ గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాసేపు చిన్నారులతో క్యారం ఆడి ఎమ్మెల్యే సందడి చేశారు. ఎంపీగా ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
పోలింగ్ బూత్లోకి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోదని అనుమానం కలిగినప్పుడు ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారికి రూ.2 చెల్లించి సవాల్ చేసే అవకాశం ఉంది. ఓటరు బోగస్ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. జాబితాలో ఉన్న విధంగా ఓటరే అయితే ఓటు వేయడానికి అనుమతిచ్చి, సవాల్ చేసిన ఏజెంట్ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2ను ప్రభుత్వానికి అప్పగిస్తారు.
జైపూర్ మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని నర్సింగాపూర్, గంగిపల్లి, కుందారం, మద్దులపల్లి అటవీ పరిధిలో చిరుత పులి సంచారాన్ని గుర్తించినట్లు అటవీశాఖ బీట్ అధికారి సతీష్ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తమ అవసరాల కోసం అడవిలోకి వెళ్లొద్దని ఆయన సూచించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటివరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో త్వరగా ఓటును వినియోగించుకోవాలి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే అయినా.. చిన్న పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగుల ఓట్లు తిరస్కరించారు.
Sorry, no posts matched your criteria.