Karimnagar

News July 22, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,69,325 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,466, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.13,575, అన్నదానం రూ.1,10,283 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News July 22, 2024

కొత్త కలెక్టరేట్‌ను సిద్ధం చేయండి: కలెక్టర్ పమేల

image

నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ 15 వరకు ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పనులన్నీ ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని సూచించారు. పనులపై నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News July 22, 2024

జగిత్యాల: డిగ్రీ ఫెయిల్.. యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై అశోక్ వివరాల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్యకు చెందిన శివాని(18) డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఈనెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది.

News July 22, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు కుట్రలను తట్టుకొని నిలిచింది: కొప్పుల 

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొప్పుల స్పందించారు. ‘తెలంగాణ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార అని కొనియాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ విమర్శించిందన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా.. లక్షల క్యూసెక్కుల నీటిరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది‘ అని అన్నారు.

News July 22, 2024

కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉచిత గ్రాండ్ టెస్టులు

image

గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు 5వ రోజు ప్రశాంతంగా జరిగినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రవి కుమార్ తెలిపారు. మొత్తం 4 గ్రాండ్ టెస్టులు, 16 పరీక్షలు ఉంటాయన్నారు. కరీంనగర్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సోమవారం 50 మంది హాజరైనట్లు వెల్లడించారు. 3వ గ్రాండ్ టెస్టు జులై 23న, 4వ గ్రాండ్ టెస్టు జులై 30, 31 తేదీల్లో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టెస్టులు ఉపయోగించుకోవచ్చన్నారు.

News July 22, 2024

గోదావరికి 16,780 క్యూసెక్కుల వరద

image

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అన్నారం బ్యారేజీలో 119 మీటర్ల లెవల్‌కు గోదావరి నదికి 16,870 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద 101.01 మీటర్ల వరద ప్రవాహం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 6,770 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

News July 22, 2024

కరీంనగర్: పెరుగుతున్న సాగు విస్తీర్ణం!

image

ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగువిస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండంతో రైతులు వరి నాట్ల జోరు పెంచారు. అలాగే ఇప్పటి వరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది అని అధికారులు అంచన వేస్తున్నారు. పలు రకాల పంటల సాగుకు మరో 10 – 15 రోజులు ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది.

News July 22, 2024

కరీంనగర్: తల్లి బాగోగులు పట్టించుకోని కొడుకులు

image

కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలో వృద్ధురాలు కోట లచ్చమ్మకు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కొడుకులెవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె కాలు జారి పడ్డారు. స్థానికులు కుటుంబీకులకు తెలిపినా ఎవరూ రాలేదు. ఈ విషయమై వృద్ధురాలి కుమార్తె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు MRO, పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 22, 2024

పార్వతి బ్యారేజీ కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం!

image

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి (సుందిల్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పార్వతి బ్యారేజీలోకి వచ్చిన వరదతో కరకట్ట మరమ్మతుకు గురైంది. అప్పటి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట తెగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 22, 2024

జగిత్యాల: వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలు

image

వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలైన ఘటన జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో చిన్నారి వేములవాడ రిషిక ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఓ వీధి కుక్క చిన్నారిపై ఎగబడి దాడి చేసింది. దీంతో చిన్నారి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద ఉందని ప్రజలు వాపోతున్నారు.