Khammam

News June 12, 2024

పోలీస్ అధికారినంటూ వైద్యుడికి బెదిరింపు

image

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడికి మంగళవారం ఓ వ్యక్తి ఫోన్ చేసి పోలీస్ అధికారినంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్యుడు ఎవరికి చెప్పాలో అర్థంకాక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. చివరకు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ను ఆశ్రయించి విషయం వివరించారు. అయితే సైబర్‌ క్రైమ్‌ నంబర్‌ 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే సదరు వైద్యుడు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

News June 12, 2024

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చేరండి: కలెక్టర్ గౌతమ్

image

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బడి బాట, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపూర్తిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్, మండలసమాఖ్యలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News June 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలారా.. వానాకాలం.. జరభద్రం

image

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కొబ్బరి చిప్పలు, ఖాళీ బొండాలు, కోడి గుడ్డు పెంకులు, మొక్కల తొట్టిలు, వృథాగా ఉన్న టైర్లు, వేసవిలో వాడిన కూలర్లలో నీళ్లు ఉంటే దోమలు తయారై డెంగీ ప్రబలే అవకాశం ఉంది. మురుగు, నిల్వ నీరు మలేరియా, ఫైలేరియా ప్రబలేందుకు దోహదం చేస్తాయి. వానాకాలంలో పరిస్థితి మరింత తీవ్రత చాటే అవకాశం ఉన్న దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

News June 11, 2024

ఖమ్మం నగరంలో ఈ నెల 13న జాబ్ మేళా

image

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ఐటిఐ ప్రభుత్వ కళాశాల నందు ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. పేటీఎం నందు ఖాళీగా ఉన్న 100 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళా కేవలం పురుషులకు మాత్రమేనని అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. వయస్సు 18-35 ఏళ్ళు మధ్య ఉండాలని పేర్కొన్నారు.

News June 11, 2024

ఖమ్మం: ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరివేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఎర్రుపాలెం మండలంలో చోటుచేసుకుంది. ములుగుమాడు గ్రామానికి చెందిన ఓ యువతీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరివేసుకుని ఉన్న యువతిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా యువతి ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News June 11, 2024

ఖమ్మం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిగురిస్తున్న ఆశలు

image

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డుల కోసం 35వేలు, కార్డుల్లో మార్పునకు 25,901 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 4,11,347 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 11,32,871గా ఉంది.

News June 11, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.6,950 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News June 11, 2024

KTDM: క్యాన్సర్‌తో 15 నెలల చిన్నారి మృతి

image

గార్లలో విషాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ బజార్‌కు చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాప మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News June 11, 2024

ఖమ్మం: వాంతులు, విరోచనాలతో రెండేళ్ల బాలుడి మృతి

image

వాంతులు, విరోచనాలతో రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బోనకల్‌లో చోటు చేసుకుంది. బోనకల్ ఎస్టీ కాలనీకి చెందిన జమలయ్య, లావణ్య దంపతుల కుమారుడు భరత్(2)కు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు గ్రామంలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.

News June 11, 2024

కేయూ పరిధిలో జులై 1 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి తెలిపారు. మొదటి పేపర్ జూలై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.