Khammam

News May 7, 2024

KMM: బీఫామ్ అందుకున్న తీన్మార్ మల్లన్న

image

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేయగా.. ఈరోజు CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రులు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News May 7, 2024

KMM: సింగరేణి ఉద్యోగి భార్య సూసైడ్

image

మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మణుగూరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. PV కాలనీకి చెందిన విజయలక్ష్మి (42) భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలి భర్త సింగరేణి ఉద్యోగి, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News May 7, 2024

ఖమ్మం: వడగండ్లు మిగిల్చిన కడగండ్లు

image

ఖమ్మం జిల్లాలో వడగండ్ల వాన రైతన్నలను ముంచేసింది. అకాల వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు వడగండ్ల దాటికి దెబ్బతిన్నాయి. ఐకేపీ కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News May 7, 2024

KMM: ఈ ఎన్నిక‌ల‌లో ఒక్క సీటైనా గెలుస్తారా: భ‌ట్టి

image

ఖ‌మ్మం MPగా BRS త‌రుపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారు? అని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ‌లో ఒక్క సీట్ కూడా గెలవని BRS నుంచి నామా ఎలా మంత్రి అవుతారని KCRను నిల‌దీశారు. ఖ‌మ్మంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల త‌ర్వాత BRSకు రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదని విమర్శించారు.

News May 7, 2024

ఖమ్మం: వడదెబ్బతో ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలోని కామంచికల్లు గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు గండ్ర లక్ష్మయ్య (75) వడదెబ్బతో మృతి చెందారు. పాల్వంచ రామవరం ఏరియాకు చెందిన ఈదులూరి కన్నయ్య (48) తాపీ మేస్త్రి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. అలాగే పెద్ద గోపవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాసమంటి వెంకటకృష్ణ (45) వడదెబ్బతో మృతి చెందాడు.

News May 7, 2024

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

అధిక లాభాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ ముసుగులో కేటుగాళ్లు వేసే వలలో పడి మోసపోవద్దని సీపీ సునీల్‌దత్ ప్రజలకు సూచించారు. ఇటీవల ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.లక్షలు మోసపోయామంటూ పలువురు తమ వద్దకు వచ్చారని చెప్పారు. అపరిచిత లింకులు, వెబ్ సైట్లను, అప్లికేషన్లను, మెసేజ్‌లను నమ్మకూడదన్నారు. బాధితులు సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930కు తక్షణమే కాల్ లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు.

News May 7, 2024

నేడు ఖమ్మం జిల్లాలో హీరో వెంకటేశ్ పర్యటన

image

సినీ హీరో వెంకటేశ్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. పర్యటన వివరాలను రఘురామి రెడ్డి వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ ఉంటుందని వెల్లడించారు.రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు.

News May 6, 2024

తులం బంగారం తుస్సుమంది: పువ్వాడ

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీలన్నీ అటకెక్కాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో నిర్వహించిన మీటింగ్‌‌‌లో మాట్లాడారు.’తులం బంగారం తుస్సు మనే.. కళ్యాణ లక్ష్మీ బుస్సుమనే’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.  ఐదు నెలల్లో అన్ని సంక్షేమ పథకాలు గాల్లోకి వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో నామాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

News May 6, 2024

ఖమ్మం: అమాంతం పెరిగిన చికెన్ రేటు

image

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. వేసవి ఎండ ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఎక్కువయ్యాయి. కిలో చికెన్ రూ.280కి విక్రయిస్తున్నారు. ఈ ప్రభావం నాటు కోడి మాంసంపైనా పడింది. గత వారం వరకు రూ.450 ఉన్న నాటు కోడి మాంసం ఈ వారం రూ.500లకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో సాధారణ రోజుల్లో 40 టన్నులు, పెళ్లిళ్ల సీజన్లో 50 టన్నుల వరకు కోడిమాంసం వినియోగం ఉంటోంది. ఆదివారమైతే అది 120 టన్నులు అవుతోంది.

News May 6, 2024

మే 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం

image

మే 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఉందని ఓటర్లు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆయన సోమవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.