Mahbubnagar

News October 20, 2024

MBNR: గ్రూప్-1 పరీక్షలపై కేటీఆర్ కుట్ర: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

image

గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ గ్రూప్-1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతం చేస్తుందోనని వారు భయపడుతున్నారన్నారు. 56 రోజులలో డీఎస్సీ వేసి, 11 వేల పోస్టింగులు ఇచ్చిన చరిత్ర మాదేనన్నారు.

News October 20, 2024

MBNR: సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ మైదానంలో ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి సీఎం కప్పు ర్యాలీని టార్చ్ వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News October 20, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

image

ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)లలో శనివారం నిర్వహించారు. దాదాపు 400 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈనెల 28, 29, 30న రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్స్ టోర్నీ MBNRలో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విలియమ్స్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News October 20, 2024

నాగర్ కర్నూల్: భర్త ప్రైవేటు పార్ట్స్ కత్తిరించిన భార్య

image

NGKL జిల్లాలో ఘోరం జరిగింది. భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కత్తిరించిన ఘటన 6 రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు ప్రకారం.. లింగాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్త (34) నిద్రిస్తుండగా ప్రైవేటు పార్ట్స్‌ను కత్తిరించగా.. ఇంటి చుట్టుపక్కల వారు బాధితుడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 20, 2024

MBNR: దసరా EFFECT.. డిపోల వారీగా ఆదాయం.!

image

దసరా పండుగ సందర్భంగా ఈ నెల ఒకటి నుంచి 16 వరకు ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక బస్సులు నడిపారు. ఉమ్మడి జిల్లాలోని 1.GDWL-415.04, 2.MBNR-519.55, 3.అచ్చంపేట-315.88, 4.కల్వకుర్తి-388.36, 5.కోస్గి-42.44, 6.కొల్లాపూర్-265.27, 7.NGKL-353.98, 8.షాద్‌నగర్-316.55, 9.NRPT-347.10, 10.WNP-485.28 (రూ.లక్షల్లో) డిపోల్లో ఆదాయం వచ్చింది. 16 రోజుల్లో 52.72 లక్షల కిలో మీటర్లలో రూ.39.22 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 19, 2024

రేపు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడంపై నిరసనగా బీఆర్‌‌ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని శ్రేణులకు కేటీఆర్ సూచనలు చేశారు.

News October 19, 2024

NRPT : విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలి : టీపీటీఎఫ్ 

image

ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారిలు సూచించారు. నారాయణపేటలోని అంబేడ్కర్ భవన్‌లో విద్యారంగ సమస్యలు, సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

News October 19, 2024

MBNR: మరణ శాసనాలుగా మారుతున్న డీజేలు

image

డీజేలు మరణ శాసనాలుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గంటల పాటు డీజేల వద్ద డ్యాన్స్‌లు చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు అనేకం. దసరా ఉత్సవాల్లో వనపర్తి జిల్లా అమరచింత మండలం మిట్టనందిమల్లలో 28 ఏళ్ల ఓ యువకుడు డీజే వద్ద డ్యాన్సు చేశాడు. ఇంటికి వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. అధిక శబ్దాలు ఇచ్చే డీజేలతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నందున వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.

News October 19, 2024

జూరాల ప్రాజెక్టు 11 గేట్ల ద్వారా నీటి విడుదల

image

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తోంది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో.. శుక్రవారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వివిధ రూపాల్లో మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News October 19, 2024

పాలమూరు జిల్లా ‘CRICKET’ జట్ల ఎంపిక

image

మహబూబ్ నగర్ పట్టణంలోని అండర్-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి (MDCA) ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 90 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 6 జట్లను ఎంపిక చేశామని, ఎంపికైన జట్లతో ఈ నెల 21 నుంచి 28 వరకు పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు.