Warangal

News March 21, 2024

వరంగల్: పాఠశాల దుస్తుల బకాయి నిధుల విడుదల

image

పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.

News March 21, 2024

జనగామ: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలో బుధవారం జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. జనగామ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారం సమీపంలో 50 ఏళ్ల వయసు ఉండే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.

News March 21, 2024

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగానికి తాళం!

image

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఎక్స్-రే మూడు రోజుల నుంచి పని చేయడం లేదు. దీంతో టెక్నీషియన్లు తాళం వేశారు. అప్పటి నుంచి అత్యవసర రోగులను ఓపీ విభాగంలోని రేడియాలజీకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఓపీ రేడియాలజీ విభాగం దూరంగా ఉండటం వల్ల రాత్రి వేళ ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఎక్స్-రే యంత్రాన్ని మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.

News March 21, 2024

రెండు రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్‌లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 21, 2024

వరంగల్: వైద్యులకు షోకాజు నోటీసులు

image

వరంగల్‌లోని పలువురు వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్‌ టి.కిరణ్‌కుమార్‌ షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న నర్సంపేట రోడ్డులోని ఓ గార్డెన్‌లో జరిగిన RMP, PMPల మహాసభలో పలువురు వైద్యులు జాతీయ, రాష్ట్ర వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా వారి అసోసియేషన్‌కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ఆయా ఆసుపత్రుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 21, 2024

అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి: డీఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో డబ్బు, మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలను డీఎస్పీ తిరుపతి రావు బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డబ్బు సరఫరా అవ్వకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.

News March 20, 2024

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం తగదు: బల్దియా కమిషనర్

image

GWMC కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రెవెన్యూ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పన్ను వసూళ్ల పురోగతిపై సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు సూచనలు చేశారు. 2023- 24 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.97.66 కోట్లు కాగా ఇప్పటికి రూ.63.96 కోట్ల సేకరణ జరిగిందన్నారు. RIల వారీగా వసూళ్ల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం తగదన్నారు.

News March 20, 2024

వరంగల్: ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరణ

image

వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్లి సురేష్ బాబు ల్యాప్‌టాప్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరించారు. ఈయన నిట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్నారు. వైర్లు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసే వైట్రిసిటీ పరిజ్ఞానంతో 7 నెలల పాటు శ్రమించి “వైర్ లెస్ ల్యాప్‌టాప్ ఛార్జర్ విత్ కూలింగ్ పాడ్”ను తయారు చేశారు.

News March 20, 2024

పర్వతగిరి: ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం నీటిలో కొట్టుకెళ్తుండగా స్థానిక గొర్రెల కాపర్లు చూసి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2024

నేటి నుంచి గుంజేడు ముసలమ్మ జాతర

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గల శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరున్న శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచి మూడు రోజులపాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరకు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటికే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో బిక్షమాచారి తెలిపారు.