Warangal

News April 1, 2024

KCR పర్యటన అంత స్క్రిప్టెడ్: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

image

దేవరుప్పుల మండలంలో కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేయడం అనుమానంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు గతంలో చూసిన పొలాలు మళ్ళీ చూడటం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ పర్యటన అంతా స్క్రిప్టెడ్ అని ఆరోపించారు. కావాలనే నీటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు.

News April 1, 2024

వరంగల్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. తమ్మిశెట్టి తిరుపతి(22) ఆటో నడుపుకుంటూ దేశాయిపేట ఎన్పీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి.. అతడి చూసి స్థానికుల సాయంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

ములుగు: వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య

image

గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) ఆత్మహత్య చేసుకుంది. పస్రా ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను చల్వాయి గ్రామానికి చెందిన చింటు ప్రేమ పేరుతో వేధిస్తూ, పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక గురువారం పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News April 1, 2024

వరంగల్: వివాహితపై అత్యాచారయత్నం

image

వివాహితపై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళ తన ఇంటి వెనకాల ఉన్న బాత్‌రూంలోకి వెళ్లారు. ఓ వ్యక్తి ఇదే అదునుగా భావించి మహిళపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో ఎంజీఎంలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.

News April 1, 2024

గూడూరు: ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్?

image

బాలుర హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని డీఈఓ రామారావు శనివారం తనిఖీ చేశారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రంలోని ఓ గదిలో ఉపాధ్యాయురాలు సెల్ ఆపరేట్ చేస్తూ డీఈఓకు కనిపించారు. నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు ఇన్విజిలేటర్లు, ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు సెల్ ఫోన్స్ తీసుకురావడాన్ని గమనించి వారిని సస్సెండ్ చేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని డీఈఓ కలెక్టర్‌కి తెలియజేశారు.

News April 1, 2024

నేడు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున:ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచిధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 31, 2024

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తోపాటు ఆయన అనుచరులపై భద్రాచల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సీతారాం నాయక్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోని గర్భగుడిలో ఫోటోలు దిగారు. అప్పటితో ఆగకుండా సోషల్ మీడియాలో గర్భగుడి ఫొటోలతో ప్రచురించటం పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

News March 31, 2024

జనగామ: బైక్ అదుపుతప్పి.. వ్యక్తి మృతి

image

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలంలోని హక్యాతండా సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వెంకన్న అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వాహనదారులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కొడకండ్ల పోలీసులు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

News March 31, 2024

గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపుర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రభాకర్, శామ్యూల్ శనివారం రాత్రి బైక్‌పై వరంగల్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎడ్ల బండిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 31, 2024

ములుగు: పాత కక్షల కారణంగా కత్తితో దాడి

image

మహదేవపూర్ మండలం బెగ్లూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తిని హత్యాయత్నం ఘటనలో శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కారు పోచయ్యపై పాత కక్షలతో కారు మల్లయ్య కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.