Warangal

News August 14, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహబూబాబాద్ ఎంపీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ బలరాం నాయక్ కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News August 14, 2024

మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి సీతక్క

image

MLG: మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. స్త్రీ లేనిదే సృష్టి లేదని, మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.

News August 14, 2024

జనగామ: ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం

image

సముద్రాల గ్రామంలో మహంకాళి ఆలయ నిర్మాణానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రజలతో మమేకమై వారి బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సముద్రాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. స్థానిక నేతలు పాల్గొన్నారు.

News August 14, 2024

వర్ధన్నపేట: కట్టుకున్న భార్యను చంపిన భర్త

image

వర్ధన్నపేట మండలం చెన్నారంలో దారుణం జరిగింది. మానసిక స్థితి కోల్పోయిన భర్త భార్యను కడతేర్చాడు. మామునూరు సీఐ రవికిరణ్ కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే హైదర్ కొంత కాలంగా మానసిక స్థితి కోల్పోయి తిరుగుతున్నాడు. కొద్దిరోజులుగా ఎవరూ కనిపించినా చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. మంగళవారం భార్యతో గొడవపడిన అతను టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. దీంతో శ్వాస ఆడక ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

News August 14, 2024

వరంగల్: మార్కెట్‌లో నేటి పత్తి ధర రూ.7150

image

ఎనుమాముల మార్కెట్‌లో పత్తి గరిష్ఠంగా రూ.7150 లు పలికింది. రూ.5000-6500 వరకు పత్తి నాణ్యతను బట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా బుధవారం మార్కెట్‌కు 150 పత్తి బ్యాగులు వచ్చినట్లు మార్కెట్ వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీ వారు తెలిపారు. కాగా, ఇదే పత్తి ధర నిన్న రూ.7180 లు గరిష్ఠంగా పలికింది. కాగా, నిన్నటికి ఇవాళ్టికి పత్తి ధరలో రూ.30 వ్యత్యాసం కనపడింది.

News August 14, 2024

NIRF 2024లో NIT-వరంగల్‌కి స్థానం

image

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ(MOE) విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) 2024లో NIT-వరంగల్ స్థానం సంపాదించింది. ఇంజినీరింగ్ కేటగిరీలో 21వ ర్యాంక్ సాధించిందని డైరెక్టర్ బిద్యధర్ సుబుధి ఓ ప్రకటనలో తెలిపారు. ఓవరాల్ కేటగిరీలో 53వ ర్యాంక్ పొందిందన్నారు. మేనేజ్‌మెంట్ విభాగంలో మొదటిసారి పాల్గొని 100వ ర్యాంక్‌ను పొందిందని వారు పేర్కొన్నారు.

News August 14, 2024

ములుగు: విద్యార్థి కార్తీకకు సీఎం రేవంత్ రెడ్డి హామీ

image

ములుగు జిల్లాలోని గురుకుల పాఠశాల భవనం పైనుంచి కిందపడి తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని కార్తీకకు సీఎం రేవంత్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంగళవారం మంత్రి సీతక్క విద్యార్థిని ఆరోగ్య పరిస్థితులపై నిమ్స్ వైద్యుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. కాగా, కార్తీక ఈనెల 9న ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. నడుము భాగంలో తీవ్ర గాయాలు కాగా, కార్తీక చికిత్స పొందుతోంది.

News August 14, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ జెండా ఎగరవేసేది వీరే

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా జిల్లాలో జెండా ఎగరవేసే వారిని ప్రభుత్వం ప్రకటించింది. హనుమకొండ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయజెండా ఎగురవేయనున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్, భూపాలపల్లిలో అటవీశాఖ ఛైర్మన్ పోడెం వీరయ్య, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎగరవేస్తారు.

News August 14, 2024

ములుగు గ్రామ పంచాయతీ ఐడియా సూపర్

image

ములుగు గ్రామ పంచాయతీ అధికారుల ఐడియా బాగుందని ప్రజలు కితాబు ఇస్తున్నారు. జాతీయ రహదారితో పాటు ఇతర కాలనీ రోడ్లలో పనులు చేసే సిబ్బంది రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. గో స్లో ములుగు గ్రామపంచాయతీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ బోర్డులను పెట్టుకొని పని చేస్తున్నారు. వాహనదారులు గమనించి నెమ్మదిగా వెళ్తున్నారని, పని ప్రదేశంలో జీపీ సిబ్బందిపై ప్రమాదాలు తగ్గుతున్నాయని ఈఓ రఘు చెప్పారు.

News August 14, 2024

WGL: ఎనుమాముల, కేసముద్రం మార్కెట్‌కు సెలవులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు ఐదు రోజుల పాటు సాధారణ సెలవులు ప్రకటించారు. ఈనెల 14 నుంచి 19 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు సెలవు రోజుల్లో మార్కెట్‌కు సరుకు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.