News August 27, 2025
KMR: వరద బీభత్సం.. 60 మందిని కాపాడిన పోలీసులు

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సుమారు 60 మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన కామారెడ్డి పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షితంగా రెస్క్యూ చేసి, సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Similar News
News August 27, 2025
మెదక్: రేపు విద్యాసంస్థలకు సెలవు..!

మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటనకు అనుగుణంగా సమన్వయం పాటించాలని సూచించారు.
News August 27, 2025
TU: PG, B.Ed, M.Ed పరీక్షలు వాయిదా

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపటి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. సంబంధిత కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు.
News August 27, 2025
భారీ వర్షాలు.. బయటకు రాకండి: NZB కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతం, నదులు, వాగులు, జలాశయాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. చేపలవేట, ఈత సరదా కోసం చెరువులు, కాలువలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు.