News June 8, 2024

‘నీట్‌’ రిజల్ట్‌పై దుమారం.. NTA కీలక నిర్ణయం

image

దేశవ్యాప్తంగా నీట్-2024 ఫలితాలపై వివాదం ముదురుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. రిజల్ట్‌పై 1,600 మంది విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించాలని నిర్ణయించింది. దీని కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ వారి ఫిర్యాదులను విశ్లేషించనుంది. ఒకే సెంటర్‌లో ఆరుగురు టాపర్లు కావడం, 67 మందికి టాప్‌ ర్యాంకు రావడంతో ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

News June 8, 2024

మోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జు

image

ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పలువురు విదేశీ అతిథులు హాజరుకానున్నారు. వారిలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచండ, భూటాన్ ప్రధాని సెరింగ్ టోబ్గే, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ తదితరులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో కొంతమంది ఇండియాకు చేరుకున్నారు.

News June 8, 2024

BJP అట్టిపెట్టుకునే కీలక శాఖలు ఇవేనా?

image

కేంద్రంలో బీజేపీ కొన్ని కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. హోమ్, ఫైనాన్స్, డిఫెన్స్, విదేశాంగ, రైల్వేలు, రోడ్లు రవాణా, న్యాయ, ఐటీ, విద్యాశాఖలను తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు దాదాపు 12 నుంచి 15 మంత్రిత్వ శాఖలను కేటాయించనున్నట్లు టాక్. జేడీయూ పార్టీకి 2, తెలంగాణ బీజేపీకి 3, ఒడిశాకు 6 నుంచి 7 మంత్రి పదవులు కేటాయించనుందట.

News June 8, 2024

అమెరికా క్రికెటర్ సౌరభ్‌పై ఒరాకిల్ స్పెషల్ ట్వీట్

image

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ‘సూపర్’ షాకిచ్చిన USA క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ హీరో అయ్యారు. దీంతో అతడి పేరు నెట్టింట మార్మోగుతోంది. తాజాగా సౌరభ్ పనిచేస్తున్న ఒరాకిల్ సంస్థ సైతం స్పందించింది. ‘అమెరికా క్రికెట్ జట్టుకు శుభాకాంక్ష‌లు. మా ఇంజినీర్‌, క్రికెట్ స్టార్ సౌర‌భ్ ప్రదర్శనపై గర్వంగా ఉంది’ అని ఒరాకిల్ ట్వీట్ చేసింది. ముంబైకి చెందిన సౌరభ్ 2010లో భారత్ తరఫున U-19 వరల్డ్ కప్‌లో ఆడారు.

News June 8, 2024

నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదు: డీజీ సుబోధ్

image

నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదని NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ పునరుద్ఘాటించారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 కేంద్రాల్లో కొందరికి ప్రశ్నాపత్రాలు తప్పుగా పంపిణీ చేసినట్లు గుర్తించామన్నారు. అభ్యర్థుల గ్రేస్ మార్కులు అర్హతను ప్రభావితం చేయలేదన్నారు. దీనిపై ప్యానెల్ సమీక్ష నిర్వహిస్తోందని, వారం రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.

News June 8, 2024

రాష్ట్రంలో 2 రోజులు సంతాప దినాలు

image

AP: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రామోజీ అంత్యక్రియలు రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.

News June 8, 2024

రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: CBN

image

యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మరారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ’40 ఏళ్లుగా నాకు ఆయన పరిచయం. మీరు ఏం చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పని చేస్తానని చెప్పేవారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. నాకు క్లిష్టమైన సమస్య వస్తే రామోజీ ధైర్యం చెప్పేవారు’ అని గుర్తు చేసుకున్నారు.

News June 8, 2024

కేంద్ర మంత్రివర్గంలోకి అన్నామలై?

image

తమిళనాడు BJP రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయనతో సహా ఇతర BJP అభ్యర్థులంతా ఓడిపోయారు. అయినప్పటికీ గతంలో 3 శాతంగా ఉన్న ఓట్ షేర్‌ను 11శాతానికి చేర్చేందుకు అన్నామలై తీవ్రంగా శ్రమించారు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటిచ్చి కేంద్రమంత్రిని చేస్తారని ఆ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

News June 8, 2024

ఫ్రెంచ్ ఓపెన్‌లో ధోనీ సందడి

image

ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశారు. టెన్నిస్ స్టార్స్ అల్కరాజ్-సిన్నర్ మధ్య జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ను తన స్నేహితులతో కలిసి మహీ వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ 2024 సీజన్ ముగిశాక ధోనీ విహారయాత్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు దేశాలను చుట్టేస్తున్నారు.

News June 8, 2024

రామోజీరావు సామ్రాజ్యం ఇదే..

image

మార్గదర్శి చిట్ ఫండ్స్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు మీడియా, సినిమా, ఆతిథ్య, షాపింగ్, పర్యాటక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఈనాడు, మార్గదర్శి, డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి, ప్రియా ఫుడ్స్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్, ఈనాడు టెలివిజన్, ఉషాకిరణ్ మూవీస్ సంస్థలను స్థాపించారు. తెలుగుతో పాటు దేశంలోని వివిధ భాషల్లో ఛానెళ్లు నడిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటినే.