News November 6, 2024

సిబ్బందికి ప్రజలు అందుబాటులో ఉండాలి: భట్టి

image

TG: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆధార్‌, ధరణి, రేషన్‌కార్డు వివరాల సేకరణకు సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ప్రజల పరిస్థితిని అంచనా వేయడానికి రాజకీయ, ఆదాయ డేటాను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల వివరాలకు గోప్యత ఉంటుందని భట్టి చెప్పారు. ఇదొక విప్లవాత్మక కార్యక్రమమని అభివర్ణించారు.

News November 6, 2024

అయ్యర్ మరో సెంచరీ

image

భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నారు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచులో ముంబై తరఫున 101 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఈ సీజన్‌లో 20 రోజుల వ్యవధిలోనే రెండో సెంచరీ చేయడం గమనార్హం. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇది 15వ శతకం.

News November 6, 2024

తాతా.. ఐ లవ్ యూ.. ట్రంప్ మనవరాలి సంతోషం

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన డొనాల్డ్ ట్రంప్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనవరాలైన కై మాడిసన్ ట్రంప్ విషెస్ తెలిపారు. ‘అమెరికన్ల కోసం మీలా ఎవరూ కష్టపడి పని చేయరు. అభినందనలు తాత, ఐ లవ్ యూ’ అని ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ -వెనెస్సా కుమార్తెనే ఈ కై. చదువుకుంటూనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు.

News November 6, 2024

అయిపోయాడనుకున్నారు.. కానీ!

image

2017లో US అధ్యక్షుడైన ట్రంప్ 2021లో బైడెన్ చేతిలో ఓడారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ నిరసనల్లో అల్లర్లు జరిగి ఆయనపై కేసులయ్యాయి. ఓ పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బిచ్చిన కేసు సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో ట్రంప్ కథ ముగిసిందని భావించారు. కానీ మళ్లీ అధ్యక్ష బరిలోకి దిగారు. ప్రచారంలో ఆయనపై కాల్పులూ జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు 47వ ప్రెసిడెంట్ అవుతున్నారు.

News November 6, 2024

IPL: వేలంలో అత్యధిక ధర పలికేదెవరు?

image

ఈ నెలాఖరులో ఐపీఎల్-2025 వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 1,574 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ వేలంలో అత్యధిక రేటు ఎవరు పలుకుతారని ప్రశ్నిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. దీనికి పంత్ అత్యధిక ధర పలుకుతారని ఎక్కువ మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో బట్లర్, బౌల్ట్, అయ్యర్, రాహుల్ పలకవచ్చని చెబుతున్నారు. మీరు ఎవరని అనుకుంటున్నారో కామెంట్ చేయండి?

News November 6, 2024

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల లోన్

image

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం హామీతో దేశంలోని 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణం లభించనుంది. లోన్‌లో 75% వరకు బ్యాంకులకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుంది. దీనిపై 3 శాతం వడ్డీ రాయితీ ఉండనుంది. ఇందుకోసం కేంద్రం రూ.3,600 కోట్లు కేటాయించనుంది.

News November 6, 2024

డ్రోన్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం

image

AP: డ్రోన్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధన, రూ.3వేల కోట్ల రాబడే లక్ష్యంగా దీనిని తీసుకురానుంది. మొత్తంగా ఈ రంగంలో 40 వేల ఉద్యోగాలు కల్పించనుంది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును తీర్చిదిద్దాలని తీర్మానం చేసింది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, R&D సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

News November 6, 2024

ట్రంప్ క్యాబినెట్లో ఇండియన్ అమెరికన్స్‌కు కీలక పదవులు!

image

డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లో ఇండియన్ అమెరికన్స్‌కు కీలక పదవులు దక్కొచ్చు. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, తులసీ గబ్బార్డ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం గ్యారంటీ. వివేక్‌కు VC పదవిని ఆఫర్ చేసేందుకు వెనకాడనన్న ట్రంప్ అతడి తెలివితేటలకు ఫిదా అయ్యారు. ఇక ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో తులసి పాత్ర కీలకం. దాదాపుగా ఆయన స్పీచుల్ని ఆమే రాశారు. ప్రజలను ఆలోచింపజేసేలా ఆమె రైటింగ్స్ ఉంటాయి. ఇక హేలీకి రాజకీయ అనుభవం ఎక్కువ.

News November 6, 2024

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. క్యాబినెట్ భేటీలో పవన్

image

AP: వైసీపీ సోషల్ మీడియా ప్రచారంపై క్యాబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై చూసీచూడనట్లుగా వదలవద్దని పవన్ చర్చను లేవనెత్తారు. ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి కొంతమంది ఎస్పీలు తప్పుకుంటున్నారని మంత్రులు ఫిర్యాదు చేశారు. నెలలోగా వ్యవస్థను గాడిలో పెడదామని సీఎం మంత్రులకు చెప్పారు.

News November 6, 2024

LMV లైసెన్స్‌తో రవాణా వాహనం నడపొచ్చు: సుప్రీం

image

లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాలు నడపొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం LMV లైసెన్స్‌తో 7500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాలను వ్యాపారస్థులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు నడపొచ్చని స్పష్టం చేసింది. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీలు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన ఈ సమస్యపై చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.