News April 9, 2024

ఈ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

image

TG: అంత్యోదయ అన్నయోజన(ఏఏవై) కింద రేషన్ కార్డుదారులందరికీ చక్కెర పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని ఏఏవై కార్డుదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో 5.99 లక్షల కార్డుదారులు ఉండగా.. 599 టన్నుల చక్కెర అవసరం. మార్కెట్‌లో రూ.40-45 వరకు ధర ఉండగా.. సబ్సిడీపై రూ.13.50లకే అందించాలి.

News April 9, 2024

గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలు.. ఈనెల 28న పరీక్ష

image

TG: గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీలు ఓ ప్రకటనలో తెలిపాయి. అర్హత పరీక్ష నిర్వహించి డిగ్రీ ఫస్టియర్‌లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నాయి. ఈనెల 28న రాత పరీక్ష ఉంటుందని, ఈనెల 21 నుంచి గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

News April 9, 2024

నేడు కోర్టు ముందుకు కవిత

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను నేడు ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కవిత తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తన అరెస్టును వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

News April 9, 2024

రియల్ ఎస్టేట్: పదేళ్లలో 3 కోట్ల ఉద్యోగాలొచ్చాయ్

image

రియల్ ఎస్టేట్ రంగంలో 2013 నాటికి 4 కోట్ల ఉద్యోగాలుండగా, తర్వాత పదేళ్లలో 3 కోట్లకు పైగా ఉద్యోగాలు లభించాయని అనరాక్-నరెడ్కో నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణ రంగానికి కేంద్ర మద్దతు కలిసొచ్చిందని పేర్కొంది. భారతీయ స్థిరాస్తి రంగం విలువ 2025 నాటికి ₹54 లక్షల కోట్లకు, 2030 నాటికి ₹83 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. వ్యవసాయం తర్వాత ఈ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపింది.

News April 9, 2024

ఇంటర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

AP: 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.
✒ జూన్ 1న కాలేజీల పునః ప్రారంభం
✒ త్రైమాసిక పరీక్షలు SEP 23-28 వరకు
✒ దసరా సెలవులు OCT 3-11 వరకు
✒ హాఫ్ ఇయర్లీ పరీక్షలు DEC 16-21 వరకు
✒ సంక్రాంతి సెలవులు 2025 జనవరి 12-18 వరకు
✒ ప్రీఫైనల్ పరీక్షలు FEB 3 నుంచి 10 వరకు, ప్రాక్టికల్స్ ఫిబ్రవరి రెండో వారంలో, థియరీ పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి.

News April 9, 2024

సృష్టి ఆరంభమైన దినమే ఉగాది!

image

‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు. అలాగే సోమకుడు వేదాలను తస్కరించడంతో విష్ణువు మత్స్యావతారంలో అతడిని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఈ సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

News April 9, 2024

ఉగాది పచ్చడికి కావాల్సినవి ఇవే

image

ఉగాది పచ్చడి తయారీకి సన్నగా తరిగిన మామిడి ముక్కలు, కప్పు చింతపండు రసం, అరకప్పు బెల్లం, కొద్దిగా వేప పువ్వు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత సరిపడినన్ని నీళ్లు కలిపితే పచ్చడి తయారవుతుంది. పచ్చడిలో కారానికి బదులు పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవచ్చు. రుచి కోసం అదనంగా కొబ్బరి ముక్కలు, వేయించిన పుట్నాల పప్పు కలుపుకోవచ్చు.

News April 9, 2024

కాస్త ఉపశమనం.. ఆ జిల్లాలకు వర్షసూచన

image

AP: రాష్ట్రంలో ఐదారు రోజులుగా 42-46 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త ఉపశమనం కల్పించాయి. నంద్యాల(D) గోస్పాడులో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే రానున్న 4రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైజాగ్, అల్లూరి, ఈనెల 11, 12న తూ.గో, NTR, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News April 9, 2024

AP EAPCETకు 3.05 లక్షల దరఖాస్తులు

image

AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె.వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి 892 చొప్పున అప్లికేషన్స్ వచ్చాయన్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 9, 2024

ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి కొత్త పేరు!

image

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా పార్టీ అధిష్ఠానం తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మాజీ ఎంపీ సురేంద్రరెడ్డి తనయుడు రఘురామిరెడ్డికి సీటు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.