News October 15, 2024

మద్యం దుకాణాల్లో SPY రెడ్డి కుమార్తె హవా

image

AP: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజల 10కిపైగా మద్యం దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, కర్నూలులో 1, పీలేరు నియోజకవర్గంలో కూడా ఆమె పలు షాపులు కైవసం చేసుకున్నారు. కాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి 246 దరఖాస్తులు వేయగా ఒక్కటంటే ఒక్క దుకాణం కూడా దక్కలేదు. దీంతో వారు లబోదిబోమంటున్నారు.

News October 15, 2024

నేటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలనే డిమాండ్‌తో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.

News October 15, 2024

‘i-Pill అంటోంది I miss you’.. వివాదం రేపిన జెప్టో నోటిఫికేషన్

image

డిజిటల్ మార్కెటింగ్‌లో క్యాచీ హెడ్‌లైన్స్, ట్యాగ్స్ భలే అనిపిస్తాయి. పదాల అర్థం, పద్ధతులపై అవగాహన లేకుంటే మిస్‌ఫైర్ అవుతాయి. వర్క్ ప్లేస్‌లో సెక్సువల్ హరాస్‌మెంట్‌పై పోరాడే బెంగళూరు లాయర్‌కు ‘ఐ పిల్ గర్భనిరోధక మాత్ర అంటోంది, ఐ మిస్ యూ పల్లవి’ అంటూ జెప్టో పంపిన మెసేజ్ పెద్ద వివాదానికే దారితీసింది. అంటే నన్నిప్పుడు దీన్ని తీసుకోమంటారా అని LinkedInలో ఆమె లాంగ్ పోస్ట్ పెట్టడంతో జెప్టో సారీ చెప్పింది.

News October 15, 2024

BJP, RSS ప్రొఫెసర్ సాయిబాబాను వేధించాయి: దిగ్విజయ్ సింగ్

image

ప్రొఫెసర్ సాయిబాబా మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘దివ్యాంగుడైన DU ప్రొఫెసర్‌ను BJP, RSS తప్పుడు ఆరోపణలతో జైలుకి పంపి వేధించాయి. అర్బన్ నక్సల్ అంటూ కేసు పెట్టి పదేళ్లు జైల్లో ఉంచారు. చివరకు హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇప్పటికైనా ఆయన సర్వీసులో వచ్చే జీతం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని అమిత్ షాకు ఫోన్ చేసి అభ్యర్థించా’ అని తెలిపారు.

News October 15, 2024

SMATలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ తొలగింపు

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఈ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను అమలు చేస్తుండగా, 2023 సీజన్ నుంచి ఐపీఎల్‌లోనూ ప్రవేశ పెట్టారు. 2027 వరకూ దీనిని కొనసాగించనున్నట్లు ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ ఈ రూల్‌ను తొలగించాలని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

News October 15, 2024

వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874: నాబార్డు

image

TG: రాష్ట్రంలో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు నాబార్డు తెలిపింది. మిగతా 45% శాతం కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి ఉందని తెలిపింది. వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874 ఉండగా, నెలవారీ ఖర్చు రూ.13,093గా ఉంది. తగినంత ఆదాయం లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చి, ఉద్యోగాలు చేసుకుంటున్నాయని వెల్లడించింది.

News October 15, 2024

అకౌంట్‌లోకి రూ.16 లక్షలు.. తిరిగి ఇవ్వనందుకు జైలు శిక్ష

image

భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్‌కు సింగపూర్‌లో 9 వారాల జైలు శిక్ష పడింది. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన డబ్బులు తిరిగివ్వనందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఓ మహిళ తాను పనిచేసే సంస్థలో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించే క్రమంలో అతని అకౌంట్‌కు పంపింది. ఆ డబ్బు తనది కాదని తెలిసినా అతను తన అప్పులు తీర్చి, కుటుంబానికీ కొంత పంపాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు.

News October 15, 2024

కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు

image

TG: DSC ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి విద్యాశాఖ ఇవాళ పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లో స్పెషల్ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఉ.9:30 నుంచి స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, మ.12.30 నుంచి SGTలకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. నేడు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. మొత్తం 11,062 ఖాళీలుండగా 10,006 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.

News October 15, 2024

పవన్ కళ్యాణ్ కామెంట్స్ తొలగించాలని పిల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిల్ దాఖలైంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వులు కలిశాయని వ్యాఖ్యానించారని, వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని లాయర్ రామారావు పిల్ వేశారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ (నిషేధ) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నేడు ఈ పిల్ విచారణకు రానుంది.

News October 15, 2024

భూముల రీసర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.