News October 4, 2024

మనకు ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ కీలకం: వాయుసేన చీఫ్

image

రక్షణ విషయంలో భారత్‌కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్‌వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.

News October 4, 2024

అభిమానులకు రజినీకాంత్ సందేశం

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News October 4, 2024

అవసరమైతే ఒక పథకాన్ని ఆపి రైతు హామీలు నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల

image

TG: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతులు ఆదరిస్తేనే తాము అధికారంలోకి వచ్చామని మీడియా సమావేశంలో చెప్పారు. అవసరమైతే ఏదైనా పథకాన్ని ఆపి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కచ్చితంగా రూ.2 లక్షలవరకు రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

News October 4, 2024

అలర్ట్.. నాలుగు రోజుల పాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు నిజామాబాద్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.

News October 4, 2024

అశ్విన్‌‌కు తగినంత గౌరవం దక్కలేదు: రమీజ్ రాజా

image

ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌పై పాక్ మాజీ సెలక్టర్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా తెలివైన ఆటగాడని పేర్కొన్నారు. ‘అశ్విన్‌కు దక్కాల్సినంత పేరు రాలేదు. ఆల్‌రౌండర్‌గా అతని రికార్డు ఎవరికీ తక్కువ కాదు. సైలెంట్‌గా తలదించుకుని తన పని తాను చేసుకెళ్లిపోతుంటారు. జట్టులో ఛాన్స్ దక్కకపోయినా ఎటువంటి ఆరోపణలు చేయరు. జట్టు పరిస్థితిని తెలుసుకుని, తదనుగుణంగా మసలుకునే ఆటగాడు’ అని కొనియాడారు.

News October 4, 2024

పాకిస్థాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్

image

రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని పాక్ అధికారికంగా ఆహ్వానించింది. దీంతో మోదీ పర్యటనపై గత కొన్ని రోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే, మోదీ తరఫున జైశంకర్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.

News October 4, 2024

ముస్లింల‌ స‌భ్య‌త్వం పెరుగుతోంది: బీజేపీ

image

UPలో తమకు ముస్లిం ఓట‌ర్ల స‌భ్య‌త్వం పెరుగుతోంద‌ని BJP తెలిపింది. స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ద్వారా Sep 30 నాటికి 4.12 లక్షల మంది ముస్లింలు మెంబర్‌షిప్ పొందినట్టు వెల్ల‌డించింది. ఇది 2014లో న‌మోదైన 1.25 ల‌క్ష‌ల కంటే మూడింత‌లు అధిక‌మ‌ని పేర్కొంది. కార్యక్రమం విజయవంతం కోసం మ‌ద‌ర్సాలు, ద‌ర్గాలు, విద్యా సంస్థ‌ల వ‌ద్ద క్యాంపుల ఏర్పాటు సహా ప్ర‌ముఖ మ‌త సంస్థ‌ల‌తో BJP భేటీ అవుతోంది.

News October 4, 2024

హైకోర్టులో సజ్జలకు ఊరట

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను ఆదేశించింది. కేసుపై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.

News October 4, 2024

జగన్ చెప్పేది ప్రజలు వినరు: పయ్యావుల

image

AP: సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మాజీ సీఎం వైఎస్ జగన్ వక్రీకరించారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ‘వైసీపీ పాలనలో తిరుమల అపవిత్రమైంది. శ్రీవారిని నమ్ముతున్నానని జగన్ ఒక్క మాట కూడా అనలేదు. ఎంతసేపూ లడ్డూ ప్రసాదం గురించే మాట్లాడుతున్నారు. కోర్టు ఆర్డర్ రాకముందే జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దోషులు ఎవరనేది విచారణలో తేలుతుంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 4, 2024

మారుమూల ప్రాంతాలకూ పార్సిల్ డెలివరీ!

image

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాలకూ పార్సిల్ డెలివరీ చేయనుంది. దేశంలో పెరుగుతున్న ఇ-కామర్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు రెండు సంస్థలూ తెలిపాయి. అమెజాన్, పోస్టల్ శాఖ 2013 నుంచి కలిసి పని చేస్తున్నాయి.