News August 13, 2024

EWS కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

AP: వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీట్లు పెంచకుండానే EWS కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. సీట్లు పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

News August 13, 2024

అడ‌ల్ట్రీపై చ‌ట్టం ఏం చెబుతోంది?

image

గ‌తంలో IPC సెక్షన్ 497 ప్రకారం అడల్ట్రీ ఒక క్రిమినల్ నేరం. 2018లో సుప్రీంకోర్టు సెక్ష‌న్ 497ను రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌క‌టించింది. 158 ఏళ్ల ఈ చ‌ట్టం ఆర్టిక‌ల్ 21 (జీవించే హ‌క్కు, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ), ఆర్టిక‌ల్ 14 (స‌మాన‌త్వం)ని హ‌రిస్తుంద‌ని న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. ఈ తీర్పు ప్ర‌కారం ఇష్టపూర్వక వివాహేతర బంధాలను క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగ‌ణించ‌డం లేదు. ఈ విషయంలో సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చు.

News August 13, 2024

ఎమ్మెల్సీ స్థానానికి 2 నామినేషన్లు.. 30న పోలింగ్

image

AP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండే నామినేషన్లు రావడం గమనార్హం. రేపు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.

News August 13, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1040 పెరిగి రూ.71,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.952 పెరిగి రూ.65,650గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.1000 పెరిగి రూ.83,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

News August 13, 2024

సీఎం గుడివాడ పర్యటన ఖరారు

image

AP: సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. పంద్రాగస్టు రోజున అన్న క్యాంటీన్లను ఆయన గుడివాడలో ప్రారంభించనున్నారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభిస్తారని సమాచారం. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ దక్కించుకుంది.

News August 13, 2024

HYDలో కంపెనీ విస్తరిస్తాం: కాగ్నిజెంట్ సీఈవో

image

TG: అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ MNC కంపెనీ ‘కాగ్నిజెంట్’ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీమ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆ కంపెనీ సీఈవో రవికుమార్ ట్విటర్‌లో స్పందించారు. ‘న్యూ యార్క్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యా. బెస్ట్ ఐటీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో కంపెనీని అధునాతన మౌలిక సదుపాయాలతో విస్తరిస్తాం. దీనిద్వారా 15వేల ఉద్యోగాలు కల్పిస్తాం’ అని ట్వీట్ చేశారు.

News August 13, 2024

Sep 9న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌

image

జీఎస్టీ కౌన్సిల్ 54వ స‌మావేశం సెప్టెంబ‌ర్ 9న ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో ప‌న్ను రేట్ల స‌ర్దుబాటు, ప‌న్ను శ్లాబ్‌ల మార్పు సహా కొన్నింటిపై డ్యూటీ ఇన్వ‌ర్ష‌న్ తొల‌గింపుపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌ల ఆరోగ్య‌, జీవిత బీమాపై, చేనేత ముడిస‌రుకుల‌పై, ఎంపీ ల్యాడ్స్ నిధులపై ప‌న్ను తొల‌గించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు రావ‌డంతో జీఎస్టీ కౌన్సిల్ ఈ విష‌యాల‌పై నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

News August 13, 2024

జేపీసీకి బీజేపీ ఎంపీ నేతృత్వం

image

వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు – 2024పై ఏర్పాటైన జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి బీజేపీ ఎంపీ జ‌గ‌దాంబిక పాల్‌ నేతృత్వం వ‌హించ‌నున్నారు. కేంద్రం ఆగ‌స్టు 8న ఈ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. అయితే, విపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. బిల్లుపై విస్తృత‌మైన అభిప్రాయాలు తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో కేంద్రం 31 మంది స‌భ్యుల‌తో కూడిన‌ జేపీసీని ఏర్పాటు చేసింది.

News August 13, 2024

దువ్వాడ శ్రీనివాస్-మాధురి వ్యవహారం: భర్త ఏమన్నారంటే?

image

AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల <<13822834>>మాధురి<<>> వ్యవహారంపై అమెరికాలో ఉంటున్న ఆమె భర్త మహేశ్ చంద్రబోస్ స్పందించారు. ‘నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. కానీ మాధురి ఇష్టపడటంతో వైసీపీలోకి వెళ్లేందుకు మద్దతిచ్చాను. నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మాధురిపై ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను’ అని స్పష్టం చేశారు.

News August 13, 2024

PAK Vs BAN: టికెట్ ధర రూ.15

image

స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు పాకిస్థాన్‌ ఫ్యాన్స్ ఆసక్తి చూపడంలేదు. ఇటీవల నిర్వహించిన PSLకూ ప్రేక్షకులు అంతగా రాలేదు. దీంతో త్వరలో జరగనున్న పాక్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ టికెట్ రేట్లను PCB భారీగా తగ్గించింది. AUG 30 నుంచి కరాచీలో జరగనున్న రెండో టెస్టు టికెట్ కనిష్ఠ ధరను రూ.15గా నిర్ధారించింది. ఇంత తక్కువకు విక్రయించడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. మరి ఇలాగైనా ఫ్యాన్స్ వస్తారో లేదో? చూడాలి.